కరోనా భయంతో కొత్త ప్రచారం .. మా ఇంటికి రాకండి, అవసరమయితే ఫోన్ చెయ్యండి అంటూ ఫ్లెక్సీలు
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి భయం విపరీతంగా పెరిగిపోయింది . భారతదేశంలో మూడు లక్షలకు చేరుకున్న కరోనా కేసులు దేశ ప్రజలను వణికిస్తున్నాయి. ఇంతగా కరోనా కేసులు పెరుగుతున్నా ఎక్కడ పడితే అక్కడే తిరుగుతూ , మాస్కులు ధరించకుండా, కరోనా నిబంధనలు పాటించకుండా కరోనాని వ్యాప్తి చేస్తున్న వారు కొందరైతే, కరోనా భయంతో తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాదు , మా ఇంటికి రాకండి మీ ఇంటికి రానివ్వకండి అంటూ ఫ్లెక్సీ ల ద్వారా ప్రచారం చేస్తున్న వారు మరికొందరు.
ఏపీలో కరోనా భయం , నైట్ కర్ఫ్యూపై యోచన .. సీఎం జగన్ చోద్యం చూస్తున్నారన్న అచ్చెన్న
రామగుండంలో ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించటానికి బ్యానర్లు
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా పై అవగాహన ఉన్న చాలామంది ప్రజలు అలర్ట్ అయ్యారు. కరోనా నియమాలను పాటిస్తూ, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కొందరు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దయచేసి మా ఇంటికి రాకండి, మీ ఇంటికి రానివ్వకండి అంటూ ఇళ్ళ ముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. రామగుండం నగరపాలక సంస్థ 31వ డివిజన్ లోని ఎల్బీ నగర్ వాసులు ప్రజల్లో అవగాహన కల్పించడానికి వారి ఇళ్ళ ముందు బ్యానర్లను పెట్టారు.
మా ఇళ్ళకు రాకండి , మీ ఇళ్ళకు రానివ్వకండి అంటూ ఇళ్ళ ముందు బోర్డులు
కరోనా మహమ్మారిని ఖతం చేద్దాం . సామాజిక దూరం పాటిద్దాం . మాస్కులు ధరిద్దాం అంటూ ఇళ్ళ ముందు బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. జడ్చర్ల లోను కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ఇళ్లముందు బోర్డులు పెట్టి మా ఇంటికి రావద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు . నాతో పని ఉందా ..? అయితే సెల్ నెంబర్ కు ఫోన్ చేయండి. ఎన్నికల ప్రచారమా ... ? అయితే కరపత్రాలు పక్కన బ్యాగులో వేసి వెళ్ళండి . కానీ దయచేసి లోపలికి రావద్దు ఇంటి గేటు బయట పెట్టి మరీ కరోనా వ్యాప్తి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారం అయితే కరపత్రాలు బ్యాగ్ లో వెయ్యండి .. జడ్చర్లలో ఓ వ్యక్తి జాగ్రత్త
ఇక జడ్చర్ల లోనూ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వారి అనుచరులు ఇంటింటికీ తిరుగుతారు కాబట్టి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు జడ్చెర్ల పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ వ్యక్తి చెప్తున్నారు.
ఇక ఇప్పటికే అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వారు , కరోనా సోకకుండా మాస్కులు ధరిస్తూ కరోనా కట్టడికి అడుగులు వేస్తున్న వారు, సామాజిక దూర నిబంధనలను పాటిస్తున్న వారు తాజా కేసుల పెరుగుదలతో మరింత అప్రమత్తమయ్యారు. ప్రజల్లో చైతన్యం రావాలి అని భావిస్తున్న పలువురు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమం చేపడుతున్నారు.