కరోనా వేళ.. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త వ్యాధి కలకలం, లెఫ్టోస్పీరోసిస్
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా.. ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఓ కొత్త వ్యాధి ఇప్పుడు కలకలం రేపుతోంది. పచ్చకామెర్ల తరహాలోనే ఉండే లెప్టోస్పీరోసిస్ అనే వ్యాధిని ఆదిలాబాద్ జిల్లాలో వైద్య అధికారులు గుర్తించారు.
అయితే, ఈ వ్యాధి అంతగా భయపెట్టేంత పెద్ద వ్యాధి కాదని, కాకపోతే సకాలంలో గుర్తించి వైద్యం అందించాలని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యాధి సోకినవారికి కళ్లు పచ్చగా మారతాయని, దానిని పచ్చకామెర్లు అనుకుంటే పొరపాటేనని, ఆలస్యం చేస్తే కిడ్నీలు, లివర్పై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ వ్యాధి ఎలుకలు, పిల్లులు, కుక్కల మూత్రం ద్వారా వ్యాధి సోకుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, చలి వంటి లక్షణాలుంటాయని, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 84,544 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 22,596 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 61,294 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 654 మంది కరోనా బారినపడి మరణించారు. తాజాగా, 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1920 మంది కోలుకున్నారు. 9 మంది మరణించారు.