మోత్కుపల్లిXఉమా: టిడిపి నేతల మధ్య కెసిఆర్ ఆజ్యం! టిఆర్ఎస్ వ్యూహం
నల్గొండ: కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 24 జిల్లాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం పది జిల్లాలు ఉన్నాయి. 22 నుంచి 24 వరకు కొత్తగా జిల్లాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తమ తమ ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని చాలామంది జిల్లా సాధనా కోసం దీక్షలు, డిమాండ్లు చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలోను భువనగిరి లేదా యాదాద్రి, సూర్యాపేట.. రెండు కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భువనగిరి, యాదాద్రి కోసం తెలుగుదేశం పార్టీ జిల్లా ముఖ్య నేతల మధ్య జగడం ప్రారంభమైంది!
జిల్లా టిడిపి పార్టీ సీనియర్లు, పార్టీ పొలిట్బ్యూరో సభ్యులైన మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, ఉమా మాధవ రెడ్డి మధ్య మరోసారి జిల్లాల పునర్విభజన అంశంపై రాజకీయ ఆధిపత్య పోరు ప్రారంభమైంది.
తన ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ మోత్కుపల్లి ప్రజా ఉద్యమం సాగిస్తుంటే, తన నియోజకవర్గ కేంద్రమైన భువనగిరినే కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉమా మాధవ రెడ్డి గళమెత్తుతున్నారు.
ఉమా మాధవ రెడ్డి భువనగిరిలో సంతకాల సేకరణ, పాదయాత్రలో పాల్గొని తన డిమాండ్ వినిపించారు. దీంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కొత్త జిల్లాల వ్యవహారం కాస్తా జిల్లా టిడిపి ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసినట్లయింది.
మోత్కుపల్లి ఆలేరు నియోజకవర్గంలో అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేసి యాదాద్రినే కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న వాదనతో ఆందోళనలు ఉద్ధృతం చేశారు. విద్యాసంస్థల బంద్, పాదయాత్రలు నిర్వహించి డిసెంబర్ 1న దీక్షకు సిద్ధమవుతున్నారు.
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తేనే యాదాద్రికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి దక్కుతుందని ఆయన అంటున్నారు. అయితే రెవెన్యూ డివిజన్గా, నియోజకవర్గ కేంద్రంగా హైదరాబాద్కు, మెదక్కు దగ్గరగా ఉన్న భువనగిరినే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఉమామాధవ రెడ్డి అంటున్నారు.
టిడిపి నేతల మధ్య సాగుతున్న పోరును అధికార పార్టీ టిఆర్ఎస్ నేతలు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ప్రజల ధోరణిని గమనిస్తూ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటులో ఎలాంటి నివేదిక ఇస్తుందో దానిని బట్టి అడుగేయాలని భావిస్తున్నారు. ఇంకా జిల్లాల ఏర్పాటు ముసాయిదా స్థాయిలోనే ఉందని చెబుతున్నారు.