జీఎస్టీ బాదుడు ఇక విద్యుత్ సేవలపై కూడా ! పాత వారికి కొంచెం రిలీఫ్.
హైదరాబాద్ : గుడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ .. జీఎస్టీ గుదిబండ సామాన్యుడి గుండెను పిండి చేస్తోంది. వివిధ శ్లాబులతో పన్ను వసూల్ చేస్తోంది కేంద్రం. అయితే జీఎస్టీ పరిధిలోకి విద్యుత్ మీటర్లు రావడంతో పన్ను బాదుడు ప్రక్రియ మొదలైంది. గత నెలలో కరెంట్ వినియోగానికి సంబంధించి జారీచేసిన బిల్లులో విద్యుత్ చార్జీతోపాటు జీఎస్టీని కూడా అదనంగా విధించారు. దీంతో బిల్లులు భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
కరెంట్ బిల్లు రూ.809 .. జీఎస్టీ రూ.432
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఉంటున్న నర్సింహారావుకు ఫిబ్రవరి నెలలో రూ. 809 కరెంట్ బిల్లు వచ్చింది. ఇందులో రూ.432 జీఎస్టీ ఉండటం విశేషం. తాము వినియోగించిన కరెంట్ కన్నా పన్ను ఎక్కువ అని వినియోగదారుడు వాపోయాడు.
జీఎస్టీ పరిధి కాదు .. కానీ ..?
వాస్తవానికి విద్యుత్ బిల్లు జీఎస్టీ పరిధిలోకి రాదు. కానీ కొత్త విద్యుత్ కనక్షన్ జారీ, అదనపు లోడ్ మంజూరు సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయని జీఎస్టీ కమిషనరేట్ ఇటీవల రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు స్పష్టంచేసింది. దీంతో విద్యుత్ ఛార్జీలకు తోడు జీఎస్టీని కూడా అదనంగా వేయడంతో బిల్లు మొత్తం పెరిగిపోయింది.
18 శాతం చార్జీల మోత
2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి జారీచేసిన కొత్త విద్యుత్ కనెక్షన్లు, మంజూరు చేసిన అదనపు లోడ్ విషయంలో సంబంధిత వినియోగదారుల నుంచి జీఎస్టీ బకాయి వసూల్ చేయాలని ఆదేశించింది. విద్యుత్ సేవలకు సంబంధించిన అన్నిరకాల డెవలప్ మెంట్ చార్జీలపై 18 శాతం జీఎస్టీని డిస్కంలు విధిస్తున్నాయి.
ఇక బాదుడే .. బాదుడు
కొత్త విద్యుత్ కనెక్షన్ తో పాటు ఇప్పటికే కనెక్షన్ కలిగి ఉండి అదనపు లోడ్ కోసం ధరఖాస్తు చేసే వారి నుంచి కూడా జీఎస్టీని ముక్కుపిండి మరీ వసూల్ చేస్తున్నారు. దీంతోపాటు 2017 జూలై నుంచి జారీచేసిన కొత్త కనెక్షన్ తోపాటు అదనపు లోడ్ మంజూరు చేయించుకున్న పాత వినియోగదారుల నుంచి జీఎస్టీ బకాయిలను ఫిబ్రవరి నెల విద్యుత్ బిల్లులలో కలిపి వసూలు చేస్తున్నాయి. ఇన్నాళ్లు విద్యుత్ మీటర్లకు లేని జీఎస్టీ బాదుడు ఈ నెల నుంచి మొదలవడంతో .. వినియోగదారుల్లో ఆందోళన చెందుతున్నారు. అయితే 2017 జూలై కన్నా ముందు ఉన్న మీటర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉండటం మిగతావారికి ఊరట కలిగించే అంశం.