నేటి నుండే తెలంగాణలో నూతన మద్యం విధానం: తెరుచుకున్న కొత్త మద్యం షాపులు
తెలంగాణ రాష్ట్రంలో పాత మద్యం దుకాణాల గడువు గురువారంతో ముగిసింది. నేటి నుంచి కొత్త మద్యం పాలసీ ప్రారంభం కానుంది. గత మద్యం పాలసీలో భాగంగా పర్మిట్ రూమ్లకు ఫీజు చెల్లించాల్సి ఉండేది. ఇప్పడు కొత్త మద్యం పాలసీలో పర్మిట్ రూమ్ ఫీజు ఎత్తివేశారు. దీంతో మద్యం వ్యాపారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ కొత్త మద్యం షాపుల యజమానులు మద్యం అమ్మకాల్లో నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తోంది ఎక్సైజ్ శాఖ.
రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .ఈసారి మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రెండు లక్షల రూపాయలకు పెంచినా , నాన్ రిఫండబుల్ అని ప్రకటించినా మద్యం దుకాణాల కోసం పోటీ పడ్డారు మద్యం దుకాణాల నిర్వాహకులు. ఇక లక్కీ డ్రా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలను కేటాయించిన ప్రభుత్వం నేటి నుండి నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకు వస్తోంది.
ముఖ్యంగా మద్యం దుకాణం దారులు కొత్త మద్యం పాలసీ ప్రకారం తమ దుకాణాల్లో మద్యం నిల్వచేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్సైజ్ శాఖ కంట్రోల్ రూంకు అనుసంధానం చెయ్యాలని తెలిపారు.ఇక అంతే కాకుండా మద్యం అమ్మకాలను జిహెచ్ఎంసి పరిధిలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విక్రయించాలని పేర్కొన్నారు.
అంతే కాదు ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చి విక్రయిస్తే పిడి యాక్టు నమోదు చేయాలని, ఎక్సైజ్ శాఖ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కొత్త వైన్ షాపుల యజమానులకు ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బెల్టుషాపులు నిర్వహిస్తే జైలుకు పంపిస్తామని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా షాపులు నిర్వహించుకోవాలని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కొత్త వైన్స్ నిర్వాహకులకు తెలిపింది. క్లస్టర్ పద్ధతిలో షాపులు ఏర్పాటు చేసుకోవాలని, కంప్యూటర్లో క్రయవిక్రయాలు నమోదు చేయాలని ఇప్పటికే పేర్కొన్న ఎక్సైజ్ శాఖ అవకతవకలకు పాల్పడకుండా నూతన విధానాన్ని రూపొందించింది. ఇక నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఇటీవల వైన్ షాప్స్ దక్కించుకున్న వారు షాపులను నిర్వహించనున్నారు.