ప్రజా గాయకుడు గద్దర్
ప్రజాయుద్ధనౌక, ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్.. సామాన్యుల్లో పెట్టింది పేరు. అప్పటికప్పుడు అశువులు రూపొందించి కవితలు చెప్పగల సామర్థ్యం ఆయన సొంతం. ప్రజా పోరాటాలకు అండగా నిలుస్తున్న గద్దర్.. తెలంగాణలో తన కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తన వంతుగా పాటలు పాడుతూ కీలక పాత్ర పోషించారు. పలు సినిమాల్లో కూడా ఆయన నటించారు. జైబోలో తెలంగాణ సినిమాలో ఆయన పాడిన 'పొడుస్తున్న పొద్దు మీద..' పాట తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన తెలంగాణలో రాజకీయ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ జేఏసీతో కలిసి ఆయన పనిచేస్తున్నారు.
కాగా, గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా, మహబూబ్ నగర్లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట "ఆపర రిక్షా" రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.