కలుపుకోరు.. కలవనివ్వరు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీనియర్ ల పెత్తనం..!గులాబీ పార్టీలో వింత పోకడ..!!
Recommended Video
హైదరాబాద్ : నియోజకవర్గ అభివృద్ధి కోసమని పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన విపక్ష ఎమ్మెల్యేలు గులాబీ వనంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. సీనియర్లతో సమన్వయం కుదరక, వారితో కలవలేక, వారు కలుపుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్లను కాదని టీఆర్ఎస్ కేడర్ తో కలవలేక సతమతమవుతున్నారు. కొన్నిచోట్ల సొంత కేడర్ తమతో పాటు పార్టీ మారకపోవడంతో ఇటు వీళ్లతో కలవక, అటు వారితో కలవలేక అయోమయంలో పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో గులాబీ గూటికి చేరుకున్న ఎమ్మెల్యేల పరిస్థితి చౌరస్తాలో చంటిపిల్లల్లా తయారైంది.
పార్టీ కార్యక్రమాలకు పిలుపు ఉండదు...! పట్టించుకున్న నాథుడే ఉండడంటున్న కొత్త ఎమ్మెల్యేలు..!!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ నిర్వహించిన ఆపరేషన్ లో కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. ఇద్దరు ఇండిపెండెంట్లతోపాటు కాంగ్రెస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే కారెక్కుతున్నట్లు లేఖలు విడుదల చేశారు. సొంత పార్టీకి రాజీనామాలు చేశారు. అప్పటి నుం చి టీఆర్ఎస్ కు మద్దతుగా పనిచేస్తున్నారు. కాగా టీఆర్ఎస్ లో కొందరు ఎమ్మెల్యే లు ఇంటా,బయటా కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొందరు ఎమ్మెల్యేల సొంత కేడర్ పూర్తిస్థాయిలో వారి వెంట రాలేదు. ఇప్పటికే సీనియర్లుగా చలామని అవుతున్న టీఆర్ఎస్ కేడర్ కు దగ్గర కాలేకపోతున్నట్లు తెలుస్తోంది.
పాత కొత్తల సమస్య..! మెసలనీయని లోకల్ సీనియర్లు..!!
రాజధాని పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. వారిలో ఒకరు మాజీ మంత్రి, మరొకరు కాంగ్రెస్ లో బాగా పట్టున్న నేత. వాళ్లిద్దరి పరిస్థితి కూడా గందరగోళంలో ఉందంటున్నారు వారి అనుచరులు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో వారు బహిరంగంగా ఎక్కడా ప్రచారం చేయలేదు. లోక్ సభ ఎన్నికల్లో కుటుంబంతో కలిసి ఓటేయడానికి వెళ్లినప్పుడు పోలింగ్ బూత్ దగ్గర ఆ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ మారడంపై ఓ సీనియర్ సిటిజెన్ ఆయన్ను నిలదీశాడు. ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా తమ కాలనీ మొత్తం ఆయనకు మద్దతుగా నిలిచినా ఇప్పుడు జెండా మార్చేశారా అని ప్రశ్నించడంతో ఇరకాటంలో పడ్డారు . ఇదే సెగ్మెంట్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన టీఆర్ఎస్ నేత వర్గం కూడా పార్టీలో ఎమ్మెల్యేకు సహకరించడం లేదని తెలుస్తోంది.
పార్టీ మారని కేడర్ తో సమస్యలు..! చీత్కరించుకుంటున్న సీనియర్లు..!!
కామారెడ్డి జిల్లాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించడంతో స్థానిక టీఆర్ఎస్, కాంగ్రెస్ కేడర్ మధ్య ఘర్షణ మొదలైంది. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు రావడంతో ఎంపీటీసీ,జడ్పీటీసీలుగా పోటీచేయాలనుకునే వారితో రెండు వర్గాల మధ్య రగడ ముదురుతోంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ కావడంతో పరిషత్ ఎన్నికల్లో టికెట్ల ఎంపిక తనదేనని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే వర్గం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యేకు అసలు పడట్లేదని జిల్లాలో చర్చ జరుగుతోంది. తనను ఓడించారన్న కోపంతో లోక్ సభ ప్రచారంలో మాజీ మంత్రి బహిరంగంగానే జనాన్నితప్పుబట్టడం కలకలం రేపింది. దీంతో ఆయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేను గుర్తించడం లేదని తెలుస్తోంది.
`లెక్కలేని తనం..! రామరామ అనుకుంటున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు..!!
నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. అయితే ఆయన గులాబీ కండువా వేసుకోలేదు. జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్టు వల్ల ఎమ్మెల్యేతో పాటు పెద్దగా కేడర్ పోలేదని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే భార్య లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ మారినట్లా లేదా అన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రత్యర్థులు ఇప్పుడు ఒకేపార్టీలో ఉన్నారు . అయితే పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న పట్టుతో మాజీ మంత్రి కొత్త ఎమ్మెల్యేను మెసలనీయకుండా చేస్తున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు . ఇప్పుడు ఎటూ కాకుండా పోయామని వారు ఆవేదన చెందుతున్నారు . ఈ పరిస్థితిలో ఆ ఎమ్మెల్యే లోక్ సభఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయలేకపోయారని సమాచారం.