కేసీఆర్ కూల్ కబురు: కొత్త ట్రాఫిక్ జరిమానాలు తెలంగాణలో అమలు చేయట్లేదు
హైదరాబాద్: ఇప్పటికే భారీ ట్రాఫిక్ జరిమానాలతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు తమ వాహనాలను రోడ్డుపైకి తీసుకురావడమే మానేశారు. దీంతో కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టంను తమ రాష్ట్రాల్లో వర్తింపజేయడం లేదంటూ ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలోకి తెలంగాణ రాష్ట్రం కూడా చేరింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో వాహనదారుడి జేబుకు చిల్లు పడుతోందని తద్వారా రాష్ట్రంలోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతారని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఉండేది ప్రజలను హింసించేందుకు కాదని చెప్పిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో కొత్త మోటార్ వెహికల్ చట్టంను అమలు చేయడం లేదని ఆదివారం ప్రకటించారు.
కొత్త జరిమానాలతో ప్రజలను హింసించదలుచుకోలేదు
తెలంగాణలో ఇప్పటి వరకే ఉన్న మోటార్ వెహికల్ చట్టంనే అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ విషయమై స్పష్టం చేశారు. కేంద్రం విధిస్తున్న జరిమానాలు ప్రజల రక్తాన్ని పీల్చేలా ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ భారీ జరిమానాలు విధించి ప్రజలను హింసకు గురిచేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కేంద్రం విధించిన భారీ జరిమానాల్లో కొంత కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇలా నిర్ణయం తీసుకున్న రాష్ట్రాల్లో గుజరాత్, కర్నాటకలు ఉన్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా జరిమానాలో కోత
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాగా ఉన్న రూ.10వేలును రూ. 1000కి చేశారు. ఇదే విధానంను కర్నాటకలో కూడా అనుసరిస్తుందని యడియూరప్ప ప్రభుత్వం వెల్లడించింది. ఇక మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర ఉత్తర్ప్రదేశ్లు కూడా కొత్త ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు వేసే జరిమానాపై పునఃసమీక్షించాలని భావిస్తున్నాయి. అంటే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ జరిమానాలపై కోత విధించేలా చర్యలకు దిగుతాయని చెప్పకనే చెబుతున్నాయి.
ట్రాఫిక్ జరిమానాలను వ్యతిరేకించిన మమతా
మరోవైపు వెస్ట్ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్, కేంద్రం తీసుకొచ్చని కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయడం లేదని బాహాటంగానే ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. ఇక ఒడిషా ప్రభుత్వం కూడా కొత్త నిబంధనలకు వ్యతిరేకమని ప్రకటించింది. జూలై 31న పార్లమెంటు కొత్త మోటార్ వెహికల్ చట్టానికి ఆమోదం తెలిపింది.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించాలని అందులో సవరణలు చేసింది. ఇక సెప్టెంబర్ 1 నుంచి ఈ భారీ జరిమానాలు అమలవుతున్నాయి.