హైదరాబాద్ కరోనా కేసుల్లో కొత్త లక్షణాలు... ఒకింత కన్ఫ్యూజన్... అసలేం జరుగుతోంది..
హైదరాబాద్లోని కోవిడ్ 19 ఆస్పత్రులకు వస్తున్న కొంతమంది పేషెంట్లలో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. డయేరియా(విరేచనాలు),వాంతులు,తలనొప్పితో వస్తున్న పేషెంట్లలోనూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా సీజన్ మారినప్పుడు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి కాబట్టి... ఏవి సాధారణ లక్షణాలో... ఏవి కోవిడ్ 19 లక్షణాలో వెంటనే నిర్దారించడం కష్టంగా మారింది. దీంతో కొత్త కేసుల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డయాగ్నోసిస్,ట్రీట్మెంట్ ఆలస్యం...
హైదరాబాద్లోని చెస్ట్ ఆస్పత్రి,కింగ్ కోఠి ఆస్పత్రుల వైద్యులు చెబుతున్న ప్రకారం... తీవ్ర విరేచనాలు,వాంతులు,తలనొప్పితో వస్తున్నవారికి డయాగ్నోసిస్ ఆలస్యం అవుతోంది. దీంతో ట్రీట్మెంట్లోనూ జాప్యం జరుగుతోంది. కొత్త లక్షణాలతో వస్తున్నవారికి టెస్టులు,చికిత్సను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలతో వస్తున్నవారిలో దగ్గు,జ్వరం,శ్వాసకోశ సమస్యలు కనిపించట్లేదని.. దీంతో వారికి కోవిడ్ 19 సోకిందా లేదా అన్నది తేలే ప్రక్రియలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.
కొత్త లక్షణాలు కనిపించేవారిలో..
సాధారణంగా ఫుడ్ పాయిజన్ లేదా సీజన్ మార్పుల వల్ల కడుపులో తిప్పినట్లయి విరేచనాలు,వాంతులు వంటివి వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. కానీ కరోనా వైరస్ ఊపిరితిత్తులకు బదులు గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ సిస్టమ్పై దాడి చేయడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లక్షణాలు బయటపడ్డవారిలో నీరసం,ఆక్సిజన్ లెవల్ తగ్గిపోవడం,బీపీ,సుగర్ లెవల్స్ పడిపోవడం,అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు.
చాలామంది వాటిని సాధారణ లక్షణాలుగా భావిస్తున్నారు...
నిజానికి విరేచనాలు,వాంతులు,తలనొప్పి వంటి లక్షణాలను గత ఏప్రిల్లోనే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్&ప్రివెన్షన్(CDC) కరోనా లక్షణాల జాబితాలో చేర్చింది. కానీ హైదరాబాద్లో ఇదివరకు నమోదైన కేసుల్లో ఈ లక్షణాలు కనిపించలేదు. కొత్తగా ఈ లక్షణాలతో కూడిన పేషెంట్లు కూడా వస్తుండటంతో.. అవి సాధారణ లక్షణాలా లేక కోవిడ్ 19 లక్షణాలా అన్న కన్ఫ్యూజన్ నెలకొంది.కరోనా వైరస్ తన జన్యు నిర్మాణాన్ని సీజన్కు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్లే క్రమంలో ఇలాంటి కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ కొత్త లక్షణాలు కరోనా వైరస్తో ముడిపడి ఉన్నాయన్న సంగతి తెలియక... చాలామంది సాధారణ విరేచనాలు,వాంతులుగానే పరిగణిస్తున్నారు. అలాంటి వారిలో డయాగ్నోసిస్ ఆలస్యం అవడం వల్ల వైరస్ లోడ్ ఎక్కువయ్యే అవకాశం ఏర్పడుతోంది.
10 రోజుల వ్యవధిలో 67 కేసులు
ఒక రిపోర్ట్ ప్రకారం.. జూన్ 20 నుంచి జూన్ 30 మధ్యలో చెస్ట్,కింగ్ కోఠి ఆస్పత్రుల్లో నమోదైన కేసుల్లో 67 కేసులు విరేచనాలు,వాంతులు,తలనొప్పికి సంబంధించినవే. ఇందులో 30 మంది ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటలకే ప్రాణాలు కోల్పోయారు. అయితే రెగ్యులర్గా వస్తున్న కేసుల్లో మాత్రం ఈ లక్షణాలు కనిపించట్లేదని వైద్యులు చెబుతున్నారు.
Recommended Video
సీడీసీ ప్రకటించిన వైరస్ లక్షణాలు
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్&ప్రివెన్షన్(CDC) కొత్తగా చేర్చిన వైరస్ లక్షణాల్లో చలి,చలితో కూడిన వణుకు,కండరాల నొప్పి,గొంతు మంట,రుచి వాసన కోల్పోవడం వంటివి ఉన్నాయి. దగ్గు,జ్వరం,శ్వాసకోశ సమస్యలు,డయేరియా,వాంతులు,తలనొప్పి వంటివి అంతకుముందు నుంచే ఆ జాబితాలో ఉన్నాయి.