తెలంగాణ పూర్తిస్థాయి డీజీపీగా మహేందర్ రెడ్డి, కేసీఆర్ సంతకం
హైదరాబాద్: తెలంగాణ పూర్తిస్థాయి డీజీపీగా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంచార్జి డీజీపీగా ఉన్నారు. ఆయన నియామకానికి సంబంధించిన ఫైల్ పైన సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
డీజీపీని నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం డీజీపీగా మహేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్కు చెందిన అధికారి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం వాసి. ఆయన ఏకోపాధ్యాయ పాఠశాలలో చదివారు. తొలుత రామగుండం ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా పని చేశారు.
అయిదేళ్ల పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో బాధ్యతలు నిర్వర్తించారు. సైబరాబాద్ కమిషనరేట్కు తొలి కమిషనర్గా వచ్చారు. గ్రేహౌండ్స్, పోలీసు కంప్యూటర్స్ తదితర విభాగాల్లో పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కమిషనర్గా పని చేసారు. ఆ తర్వాత ఇంచార్జి డీజీపీగా ఉంటున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు.