కూటమిలో కొత్త ట్విస్ట్...! టీడిపి స్థానాలపై కన్నేసిని కాంగ్రెస్..!!
హైదరాబాద్: తెలంగాణ మహాకూటమిగా ఏర్పడ్డ టీడిపి-కాంగ్రెస్ మద్య అనుకోని ట్విస్టులు జరుగుతున్నాయి. గ్రేటర్ లో పట్టున్న టీడిపి స్థానాలను కాంగ్రెస్ పార్టీ కోరుతుండడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో అన్నీ సవ్యంగా చర్చించుకుని సీట్ల పంపకాల పట్ల ఉమ్మడి ప్రకటన చేస్తామని చెబుతున్న కూటమి పెద్దలకు సీట్ల సర్ధుబాటు ప్రక్రియ మాత్రం ఇబ్బందిగా పరిణమించింది. తెలుగు దేశం పార్టీకి ప్రాబల్యం ఉన్న నియోజక వర్గాలను కాంగ్రెస్ పార్టీ కోరుకోవడమే పరిస్తితులకు కారణమని తెలుస్తోంది. అదికార పార్టీ అభ్యర్ధులను ప్రకటించడమే కాకుండా ప్రచారంలో సైతం రాకెట్ లా దూసుకెళ్తున్నా, ప్రతిపక్షాలు మాత్రం ఇంతవరకూ సీట్ల సర్ధుబాటు దగ్గరే ఉన్నారనే చర్చ జరుగుతోంది.
కూటమిలో కొలిక్కి రాని సర్థుబాటు..! టీడిపి కొన్ని సీట్లను త్యాగం చేసే అవకాశం..!!
తెలంగాణలో రాజకీయం కొత్త పోకడలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఏ రాజకీయ పరిణామం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. టీఆర్ఎస్ సహా ప్రతిపక్షాలన్నీ ఎన్నికల కోసం సిద్ధమవుతుండడంతో రాష్ట్ర రాజకీయ హడావిడి రోజురోజుకూ పెరిగిపోతుంది. గులాబీ పార్టీని మరోసారి గద్దెనెక్కనీయకూడదని ప్రతిజ్ఞబూనిన ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మరికొన్ని పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయనుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ పొత్తుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుండగా, తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో చర్చలు జరిపి కూటమిలో చేర్చుతోంది.
ప్రతిపాదనలు ఎక్కువ.. !పరిష్కారం తక్కువ..!ముందడుగు పడేది ఎలా..?
ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీలతో చర్చలు సఫలం కాగా, సీట్ల సర్ధుబాటు మాత్రం మిగిలి ఉంది. ఇందులో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ తీసుకోనుండగా, మిగిలిన పార్టీలు కూడా తమ ప్రతిపాదనలను కూటమిలో పేర్కొంటున్నాయి. ఈ కారణంగానే సీట్ల సర్ధుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని చోట్ల ఆయా స్థానాలు ఎవరికి దక్కుతాయో తెలియక కూటమిలోని పార్టీల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. గ్రేటర్ పరిదిలో తెలుగుదేశం పార్టీ పటిష్ఠంగా కనిపిస్తోంది. కాని మిత్రపక్షం కావడంతో ఏ సీటు ఎవరికి కేటాయిస్తారో అన్న ఆసక్తి నెలకొంది. కూకట్ పల్లి, షేర్ లింగం పల్లి, రాంజేంద్ర నగర్, ఉప్పల్, కంటోన్మెంట్, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, ఇబ్రహీం పట్నం తో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీడిపి కి మంచి క్యాడర్ ఉంది.
జూబ్లీహిల్స్ మాకంటే మాకు..! టీడిపి కాంగ్రెస్ మద్య నలుగుతున్న వ్యవహారం..!!
మరోవైపు, ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో రాబోతుందని ప్రచారం జరుగుతున్నా, కాంగ్రెస్ -టీడీపీల మధ్య సీట్ల సర్దుబాటు చెలిమి ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని స్థానాల్లో రెండు పార్టీలకు చెందిన నేతలు ప్రచారం మొదలుపెట్టేశారు. ఇలాంటి వాటిలో గ్రేటర్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. అయితే, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కేసీఆర్ మరోసారి ఆయనకే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్థానంలో పోటీ కోసం టీడీపీ, కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. తమ సిట్టింగ్ స్థానమని టీడీపీ పట్టుబడుతున్నా, సీటు మాత్రం కాంగ్రెస్కే దక్కే అవకాశాలు ఉన్నాయి.
గ్రేటర్ లో టీడిపి మళ్లీ అవకాశాలు..! మాక్కూడా అంటున్న కాంగ్రెస్..!!
కాంగ్రెస్ నుంచి పీజేఆర్ వారసుడు మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్దన్రెడ్డి రేసులో ఉన్నారు. గతంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో దాదాపు విష్ణువర్ధన్రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ మేరకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దీంతో ఆయన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. బస్తీల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. అయితే, టీడీపీ ఈ సీటు విషయంలో రాజీ పడేలా కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ టికెట్ ఏ పార్టీని వరిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలుగుదేశం క్యాడర్ తో పాటు సెటిలర్స్ ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో మళ్లీ టీడిపి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలు చెప్తున్నా సీటు ఏ పార్టీకి దక్కుతుందో అన్న అంశం ఉత్కంఠగా మారింది.