ట్విస్ట్: ఏఎస్సై మోహన్ రెడ్డితో సంబంధాలున్న డిఎస్పీలకు పోస్టింగ్లు
కరీంనగర్: వడ్డీ వ్యాపారిగా మారి అక్రమ దందాలు, బెదిరింపులకు పాల్పడి రూ.కోట్లు సంపాదించిన ఏఎస్సై మోహన్ రెడ్డి కేసులో దర్యాఫ్తు ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు అతనితో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు పోస్టింగులు వచ్చాయి.
అతనితో సంబంధాలు ఉన్నాయని పలువురు డీఎస్పీలు, ఏసీపీలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వడ్డీ వ్యాపారంలో పెట్టుబడుల కోసం తనకు కొందరు డిఎస్పీలు, ఏసీపీలు డబ్బులు ఇచ్చారని ఏఎస్సై మోహన్ రెడ్డి పేర్లు చెప్పారు.
వెంటనే వారి పైన క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ముగ్గురు డిఎస్పీలను బదలీ చేశారు. ఏఎస్సై మోహన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా దర్యాఫ్తు బాధ్యతను సిఐడికి అప్పగించారు. దీనిపై దర్యాఫ్తు కొనసాగుతోంది.
మోహన్ రెడ్డికి సహకరించిన కీలక నిందితుడు జ్ఞానేశ్వర్ సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
ఏఎస్సై మోహన్ రెడ్డి చెప్పిన పోలీస్ అధికారుల పేర్ల ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగానే మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎస్పీలకు ఇద్దరికి పోస్టింగులు వచ్చాయి. వారు తప్పించుకునేందుకు ప్రజాప్రతినిధులను ఆశ్రయించినందు వల్లే పోస్టింగులు వచ్చాయని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.