నోటుకు ఓటు కేసులో కొత్త ట్విస్ట్: ఆంధ్ర పోలీసాఫీసర్లకు, నేతలకు ఎసిబి నోటీసులు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కొత్త మలుపు తిరగనుంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంత మంది పోలీసు అధికారులకు, రాజకీయ నాయకులు నోటీసులు జారీ చేయడానికి తెలంగాణ ఎసిబి రంగం సిద్ధం చేసుకుంటోంది. రెండు, మూడు రోజుల్లో వారికి నోటీసులు జారీ చేయవచ్చునని అంటున్నారు.
ఓటు నోటు కేసులో నిందితుడు మత్తయ్య జెరూసలెంకు, విచారణకు డుమ్మా కొట్టిన తెలుగు యువత నాయకుడు జిమ్మీ బాబుకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణపై ఎసిబి వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. హైదరాబాదు నుంచి పారిపోవడానికి ముందు వారిద్దరికి ఆశ్రయం కల్పించిన పోలీసు అధికారులకు, రాజకీయ నేతలకు సంబంధించిన ఆధారాలను ఎసిబి సేకరించినట్లు తెలుస్తోంది.
తమకు దొరకకుండా మత్తయ్యను తప్పించారని ఎసిబి అధికారులు కొందరిపై అభియోగాలు మోపే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. మత్తయ్య తెలంగాణ రాష్ట్రం నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశ్రయం పొందిన విషయం బహిరంగ రహస్యమే. ఆయన పోలీసు వాహనాల్లో తిరిగినట్లు ధ్రువీకరించే ఆధారాలను తెలంగాణ ఎసిబి సేకరించినట్లు తెలుస్తోంది.
అలాగే, జిమ్మీ బాబు నోటుకు ఓటు వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని తెలంగాణ ఎసిబి అధికారులు భావిస్తున్నారు. విచారణకు హాజరు కాకుండా జిమ్మీ బాబు ఎసిబి నుంచి తప్పించుకున్నాడు. జిమ్మి బాబు కూడా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటినట్లు భావిస్తున్నారు. ఇందుకు సహకరించిన ఆంధ్ర పోలీసులపై, రాజకీయ నేతలపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ఎసిబి అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.