గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కొత్త ట్విస్ట్ .. పోలీసులు,రెవెన్యూ అధికారులే టార్గెట్ గా ..
సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. గ్యాంగ్ స్టర్ నయీం మరణానంతరం నయీమ్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల తీగలాగితే అవాక్కయ్యే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీం తో చాలామంది పోలీసులకు, రెవిన్యూ శాఖ అధికారులకు సంబంధాలు ఉన్నట్లుగా వెలుగులోకి రావడంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.
నయీం కేసు విచారణ కోసం లోక్ పాల్ కు లేఖ రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
తాజాగా మరోమారు నయీం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును లోక్ పాల్ చట్టం కింద విచారించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. ఇక దీనికి సంబంధించి లేఖ రాసిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్.టి.ఐ చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని,నయీం తో పోలీసులు,రెవెన్యూ అధికారులు దిగిన ఫోటోలను,అంతేకాకుండా వీడియోసాక్ష్యాలను కూడా లోక్ పాల్ కు సమర్పించి ఈ కేసును విచారించాలని కోరింది.
నాలుగు రాష్ట్రాల పోలీసులు,రాజకీయ నేతల ప్రమేయం
నయీం కేసులో నాలుగు రాష్ట్రాల పోలీసులు,రాజకీయ నేతల ప్రమేయం ఉన్నదని,ఇక వాటికి సంబంధించిన అన్ని అంశాలను, నిజానిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆసక్తికరమైన అంశాలను తన లేఖలో పేర్కొంది. నయీంకు సంబంధించిన డైరీ, భూములు, డబ్బులకు సంబంధించిన డంప్ లు ఎక్కడ ఉన్నాయి. బినామీ పేర్లతో ఎవరెవరి పేరు మీద ఆస్తులు ఉన్నాయి వంటి అనేక అంశాలను ఇంకా తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, గోవాలలో నయీమ్ కు ఉన్న లింకు లపై విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తన లేఖలో పేర్కొంది.
నయీంతో 25 మంది పోలీసు అధికారులకు సంబంధం ఉన్నట్లుగా తేల్చిన సిట్
ఇక సిట్ విచారణలో నయీంతో 25 మంది పోలీసు అధికారులకు సంబంధం ఉన్నట్లుగా తేల్చారు. వీరితో పాటు రాజకీయ పార్టీల నాయకులకు కూడా సంబంధాలున్నట్లు గా సిట్ తేల్చింది. ఇక ఇప్పటి వరకు నయీంకు సంబంధించి 250 కేసులు నమోదు కాగా వాటిలో 107 కేసులకు ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. ఇక ఇరవై తొమ్మిది కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2016 ఆగస్టులో నయీం ఎన్కౌంటర్ జరిగినప్పటినుంచి ఇప్పటివరకు నయీం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
అవినీతి అధికారుల భరతం పట్టాలనే లోక్ పాల్ కు లేఖ
ఇక ఇప్పటివరకు నయీం అనుచరుల నుండి 2.16 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బుతో పాటుగా 2 కిలోల బంగారం,రెండు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.ఇక అంతే కాదు ఇప్పటివరకు 1050 ఎకరాల భూములు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. అయితే మరింత లోతుగా దర్యాప్తు జరిపితే నయీం కేసులో అవినీతి అధికారుల గుట్టు రట్టు అవుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లోక్ పాల్ విచారణ జరిపించాలని లేఖ రాసింది.