శ్రీశైలం అగ్నిప్రమాదంలో కొత్త కోణం .. అర్దరాత్రి సమయంలో బ్యాటరీల మార్పుపై అనుమానాలు
శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తును ముమ్మరం చేసిన సిఐడి ప్యానెల్ బోర్డులో వచ్చిన మంటలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అంతా భావిస్తున్న నేపథ్యంలో తాజాగా దర్యాప్తులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కొత్త బ్యాటరీలు అమరుస్తున్నట్టు , బ్యాటరీలు అమర్చే క్రమంలోనే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా కూడా అనుమానిస్తున్నారు. అయితే ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు కారణమవుతోంది.
అర్ధరాత్రి సమయంలో బ్యాటరీల అమర్చవలసి అవసరం ఏముంది ? బ్యాటరీ లో అమర్చే సమయంలో జరిగిన పొరబాటు వల్లనే తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయా ? ఇది మానవ తప్పిదమా? లేక శ్రీశైలం అగ్ని ప్రమాదంలో జరిగింది సాంకేతిక తప్పిదమా ?అన్న ఆసక్తికర ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అంతే కాదు బ్యాటరీలు సంబంధిత అధికారులు, సీఈలు లేకుండా ఎందుకు మారుస్తున్నారు అనే వివరాలను సేకరిస్తోంది. బ్యాటరీలు బింగించే సమయంలో జనరేటర్లు ఎందుకు ఆపలేదనే కోణంలో సిబ్బందిని సీఐడీ ప్రశ్నిస్తోంది. పాత బ్యాటరీలు అంతా పూర్తిగా పాడయ్యే వరకు ఎందుకు విద్యుత్ అధికారులు వేచి చూసారని అధికారులను ప్రశ్నించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి వద్ద ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఐడీ సేకరిస్తోంది.
220 కేవీకి డీసీ కరెంటు సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్యానల్ బోర్డులో మంటలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగిందని మరోపక్క జెన్కో ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. జనరేటర్ను నియంత్రించే సెన్సార్ కు నేరుగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో లోడ్ పెరిగి మంటలు చెలరేగినట్టు కొందరు అధికారులు అనుకుంటున్నారు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు ఇదంతా సాంకేతిక పరమైన అంశం కావడంతో ప్రధానంగా యూనిట్ల పనితీరు ,తదితర అంశాల దర్యాప్తుకు నిపుణుల సహకారం తీసుకుంటున్నారు.
దర్యాప్తులో విద్యుత్ రంగ నిపుణులు సిఐడీ అధికారులకు సాంకేతిక పరమైన అంశాలను వివరిస్తున్నారు .సిఐడీ అధికారులు విద్యుత్ కేంద్రంలో పని చేసే ఉద్యోగుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. అయితే సిఐడి విచారణ కొనసాగుతుండగానే శ్రీశైలం అగ్నిప్రమాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదానికి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. జల విద్యుత్ కేంద్రం తిరిగి పునర్వైభవానికి నోచుకోవాలంటే వేల కోట్లను ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.