మక్కా మసీదు పేలుళ్లపై తీర్పు: ట్విస్ట్, కోర్టుకు హాజరైన జడ్జి, రాజీనామా ఆమోదించలేదు
హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి అంశంలో మరో ట్విస్ట్. ఆయన ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. అయితే అంతకుముందు కొద్ది రోజుల పాటు సెలవులు పెట్టి, ఆ తర్వాత రాజీనామా ఆమోదించాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
షాక్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన జడ్జి రాజీనామా, అసలేం జరిగింది?
అయితే, ఇది గురువారం కొత్త మలుపు తిరిగింది. హైకోర్టు రవీందర్ రెడ్డి రాజీనామాను ఆమోదించలేదు. ఆయన సెలవులు కూడా రద్దు చేసింది. మరోవైపు, ఆయన నేడు (గురువారం) కోర్టుకు కూడా హాజరయ్యారు. దీంతో ఇది కొత్త మలుపు తిరిగింది. రాజీనామా చేసిన 48 గంటల్లోనే ఆయన విధులకు హాజరయ్యారు.
కాగా, మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన ఘటనలో సోమవారం ఉదయం తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి, సాయంత్రానికి రాజీనామాను సమర్పించిన విషయం తెలిసిందే.
ఎన్ఐఏ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రవీందర్ రెడ్డి ఉన్నారు. ఆయన సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్కు పంపించారు. ఆయన మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. కానీ ఆయన తీర్పు అనంతరం సాయంత్రం హఠాత్తుగా రాజీనామా చేశారు.
ఎన్ఐఏ జడ్జిగా ఉన్న రవీందర్ రెడ్డి రెండు నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, మక్కా మసీదు కేసులో తీర్పు వచ్చిన రోజే రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తీర్పు తర్వాత తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన సన్నిహితులతో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
ఆయన తెలంగాణ జ్యూడిషియరీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లుగా అధికారికంగా పేర్కొన్నారని తెలుస్తోంది.
కానీ తీర్పు, బెదిరింపుల తర్వాత రాజీనామా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కారణాలు తెలియకుండానే.. ఆయన రాజీనామా చేయడం, హైకోర్టు ఆమోదించకపోవడం, ఆయన విధులకు హాజరుకాకపోవడం గమనార్హం.