శశికుమార్ మృతి కేసులో మరిన్ని ట్విస్ట్లు: ఆ కారు ఎవరిది?
హైదరాబాపద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి ఫామ్హౌస్లో జరిగిన డాక్టర్ శశికుమార్ మృతిపై మరిన్ని కోణాలు వెలుగు చూస్తున్నాయి. శశికుమార్ కేసును సైబరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తన భర్తను సాయికుమారే హత్య చేశాడంటూ మృతుని భార్య కాంతి చేసిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మొయినాబాద్ మండలం నక్కలపల్లిలోని శశికుమార్ స్నేహితురాలైన చంద్రకళకు చెందిన ఫామ్హౌస్లో సంఘటన జరిగిన రోజు ఏమైందనే దానిపై దృష్టి పెట్టారు.
ఫిబ్రవరి 9వ తేదీన 6.30 గంటల ప్రాంతంలో చంద్రకళతో పాటు శశికుమార్ కారులో ఇక్కడికి వచ్చినట్లు ఫామ్హౌస్ వాచ్మన్ శంకరయ్య చెబుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఫామ్హౌస్ సమీపంలోని సెల్ టవర్ పరిధిలో ఆ రోజు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు ఎవరెవరు ఫోన్లు మాట్లాడారో తెలుసుకుంటున్నారు.
కేసులో కీలకంగా మారిన సూసైడ్నోట్ రాసిందెవరనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇందుకు హైదరాబాదులోని చైతన్యపురిలో శశికుమార్కు చెందిన ఆసుపత్రిలో గతంలో ఆయన చేతిరాత పత్రాలను కొన్నింటిని పోలీసులు సేకరించారు. వాటితో సూసైడ్ లేఖతో పాటు రివాల్వర్ను ఎఫ్ఎస్ఎల్కు పంపించారు.
కాగా, రివాల్వర్ను పేల్చిన సమయంలో పొడిలాంటి పదార్థం పడుతుంది. శశికుమార్ మృతదేహం సమీపంలో ఇలాంటి పదార్థం ఏమైనా పడిందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్తో పాటు సాయికుమార్, శశికుమార్, చంద్రకళ చరవాణిల కాల్ డేటాలను కూడా సేకరిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు కాల్పుల ఘటనపై దర్యాప్తు సాగిస్తుండగా, మొయినాబాద్ పోలీసులు మాత్రం శశికుమార్ అనుమానాస్పద కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఆ రోజు సాయంత్రం 6.30కు ఫామ్హౌస్కు వచ్చి స్నేహితుడు శశికుమార్ను అక్కడే వదిలేసినట్లు, వాచ్మెన్ శంకరయ్యను వెంటబెట్టుకొని నక్కలపల్లి గ్రామానికి కారులో వెళ్లినట్లు, శశికుమార్కు చికెన్, బగారా అన్నం వండుకు వెళ్లాలని కొంత నగదు ఇచ్చి నగరానికి వెళ్లిపోయినట్లు చంద్రకళ చెబుతున్నారు.
అయితే, రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ కారు ఫామ్హౌస్ వైపు వచ్చినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సమయంలో అటు వచ్చిన కారు ఎవరిదై ఉంటుందనే దానిపైనా విచారిస్తున్నారు. సాయంత్రం 6.30 ప్రాంతంలో వచ్చిన కారే రాత్రి 9 గంటలకు స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు రివాల్వర్ కాల్చిన సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. కానీ రక్తపుమడుగులో పడి ఉన్న శశికుమార్ గది పక్కనే మరో గదిలో పడుకొని ఉన్న వాచ్మెన్ మాత్రం తనకు ఎలాంటి శబ్దం విన్పించలేదని పోలీసులకు వివరించారు. మామూలుగా రివాల్వర్ కాల్చిన సమయంలో 2 కిలోమీటర్ల మేర శబ్దం విన్పిస్తుందని, పక్క గదిలోనే పడుకున్న శంకరయ్యకు ఆ శబ్దం విన్పించలేదంటే నమ్మలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.