షాకింగ్: 'ప్రగతి భవన్ వద్ద పవన్ కళ్యాణ్ పడిగాపులు', కిరణ్ రెడ్డిని లాగిన జనసేనాని
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వారి భేటీపై ఇప్పటికే ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్పై నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్న మహేష్ కత్తిలు మళ్లీ స్పందించారు.
కేసీఆరే స్ఫూర్తి: ఆశ్చర్యం, ఆనందం: భేటీ అనంతరం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended Video
భేటీ అనంతరం పవర్ స్టార్ పవన్ సీఎం కేసీఆర్ పైన ప్రశంసలు కూడా కురిపించారు. సీఎంను నూతన సంవత్సరం సందర్భంగా కలిశానని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ విషయమై ఆయనను అభినందించేందుకు వచ్చానని, నిరంతర విద్యుత్ సరఫరా నిర్ణయంతో ఆశ్చర్యపోయానన్నారు.
కిరణ్ రెడ్డిని లాగిన పవన్ కళ్యాణ్
తెలంగాణలో విద్యుత్ సరఫరా అసాధ్యమని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, కానీ కేసీఆర్ దానిని అమలు చేసిన తీరు తనకు నచ్చిందని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తనకు చాలా సందేహాలుండేవని, ఆయనను కలిసినప్పుడు ఇది ఎలా సాధ్యమైందో అడిగి తెలుసుకున్నానని పవన్ చెప్పడం గమనార్హం.
చర్చకు దారి తీసిన కలయిక
తాను ఏపీలో పర్యటించినప్పుడు హక్కుల సాధనకు కేసీఆర్ స్ఫూర్తిని చూసి నేర్చుకోవాలని చెబుతుంటానని, ఉద్యమ పార్టీగా, టీఆర్ఎస్ మీద, ఆపార్టీ నాయకుల మీద తనకు మొదటి నుంచి గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాలలోని సమస్యలను పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. ఇరువురి భేటీపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ పడిగాపులు
అయితే, కేసీఆర్ను పవన్ కలవడంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ తర్వాత మహేష్ కత్తి కూడా స్పందించారు. 'ప్రగతి భవన్లో పవన్ కళ్యాణ్ పడిగాపులు. ముఖ్యమంత్రికి న్యూఇయర్ విషెస్ చెప్పడానికా? అజ్ఞాతవాసి ప్రీమియర్ల పర్మిషన్కా?' అని తన ఫేస్బుక్ అకౌంటులో పోస్ట్ చేశారు. అంతకుముందు అవసరం రాజకీయ నాయకులను ఎంతటికైనా మార్చేస్తుందని వర్మ సెటైర్ వేశారు.
తెలంగాణలో నాకు బలం ఉందని పవన్ కళ్యాణ్?
కేసీఆర్తో భేటీ సందర్భంగా తెలంగాణలో తనకు బలం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారని వార్తలు వస్తున్నాయి. దీని పైనా పవన్ స్పందించారు. '"తెలంగాణాలో నా బలం నాకుంది" - పవన్ కళ్యాణ్. నిజమే నైజాం ఏరియా టోటల్ కలెక్షన్స్ లో 50% ఉంటుంది. ముఖ్యంగా హైప్ చేసి హైదరాబాద్ లో ప్రీమియర్ల పెడితే టికెట్టుకి 3,000 నుంచీ 5,000 లాగొచ్చు. అంత బలం ఉంది. ఆ బలానికి బలగం తోడు అవ్వాలంటే, కె.సి.ఆర్ అనుగ్రహం కావాలి. భేష్!!!' అని కత్తి మహేష్ కౌంటర్ వేశారు.
మహేష్ కత్తి మరో కౌంటర్
'తెలంగాణాలో 24 గంటల పవర్ ఎలా వస్తోందో తెలుసుకున్న పవర్ స్టార్...అబ్బా!!! పవర్ సర్ప్లస్ ఉంటే వస్తుంది. లేదా వేరే స్టేట్ నుంచి కొనుక్కుంటే వస్తుంది. లేదా ఆంధ్రప్రదేశ్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టులో భాగం అయితే ఉంటుంది.దీనికి ఒక పాలసీ స్టడీ. సరేగానీ, అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ ఎన్ని పడతాయో చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్!' అంటూ మరో పోస్టులో మహేష్ కత్తి సెటైర్ వేశారు.
ఒకరి కోసం మరొకరు?
తన సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్.. కేసీఆర్ను కలవడం మాత్రం చర్చకు దారి తీసింది. గతంలో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. అయితే సినిమాలు లేదా రాజకీయాలు ఒకరి అవసరం మరొకరికి ఉందని ఇరువురు కూడా ఆలోచించి ఉంటారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని చెప్పినప్పటికీ ప్రధానంగా ఏపీ పైనే దృష్టి సారిస్తారు. పవన్కు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అలా ఆయన అవసరం కేసీఆర్కు కావాలి. అలాగే, ఇప్పుడు సినిమా కోసం పవన్కు అవసరం అని అంటున్నారు.