కోఠి ఆస్పత్రిలో పాపను ఎత్తుకెళ్లిన బీదర్ మహిళ అరెస్ట్: పెంచుకునేందుకేనని..
హైదరాబాద్: నగరంలోని సుల్తాన్బజార్ ప్రసూతి ఆసుపత్రిలో శిశువును ఎత్తుకెళ్లిన నైనా అనే మహిళను హైదరాబాద్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ అధికారులు బీదర్లో బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రాథమికంగా విచారించి హైదరాబాద్కు తీసుకువస్తున్నారు.
హ్యాపీ ఎండింగ్: కోఠి ఆస్పత్రిలో కిడ్నాపై తల్లి ఒడికి చేరిన ఆ పాపకు ఏసీపీ 'చేతన' పేరు
నైనా (25) బీదర్లోని షాగంజ్లో నివాసం ఉంటోంది. ఆమె భర్త సైమన్ హైదరాబాద్లోని ఎల్బీనగర్ సమీపంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తనకు రెండుసార్లు గర్భస్రావం అయిందని, భవిష్యత్తులో పిల్లలు పుట్టరన్న అనుమానంతోనే చిన్నారిని అపహరించినట్లు ఆమె టాస్క్ఫోర్స్ పోలీసులకు తెలిపింది.
ఎలాగైనా సరే తల్లిని కావాలన్న ఉద్దేశంతో శుక్రవారం బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చింది. శనివారం రెండు, మూడు ఆసుపత్రులను పరిశీలించి కోఠి ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుంది. మంగళవారం ఉదయం ఆసుపత్రికి వచ్చి ప్రసూతి వార్డులో సుజాత జన్మనిచ్చిన ఆరురోజుల శిశువును అపహరించి బీదర్కు తీసుకెళ్లింది.
ఆ తర్వాత పోలీసులు తీవ్రంగా గాలించడం, మీడియాతో ఆ మహిళను చూపించడంతో భయపడిపోయిన ఆమె.. పాపను బీదర్ ఆస్పత్రి వద్దకు స్కూటీపై వచ్చి అక్కడ వదిలేసిన విషయం తెలిసిందే. దీంతో బీదర్ వెళ్లిన ఏసీపీ చేతన ఆ పాపను తీసుకొచ్చి తల్లి వద్దకు చేర్చారు. కాగా, పాపను కిడ్నాప్ చేసిన మహిళతోపాటు ఆమెకు సహకరించిన ఇద్దరు యువకులు, ఓ బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.