తెలంగాణలో కరోనా ఉప్పెన: 54 వేలను దాటేసిన కేసులు: గ్రేటర్లో ఆందోళనకరంగా: జిల్లాలవారీగా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్క జిల్లా మినహా అన్ని జిల్లాలోనూ కేసుల వెల్లువ కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య చాలా తక్కువే. అయినప్పటికీ..అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో 1593 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. 998 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 54,059కి చేరుకుంది. ఇందులో 41,332 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 463కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 12,264గా నమోదు అయ్యాయి. జాతీయ సగటుతో పోల్చుకుంటే తెలంగాణలో నమోదవుతోన్న మరణాల శాతం 0.86 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 2.3గా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 24 గంటల్లో జీహెచ్ఎంసీలో 641 కేసులు నమోదు అయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 131, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 91 కేసులు వెలుగులోకి వచ్చాయి. వనపర్తి, నిర్మల్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. జగిత్యాల-2, జయశంకర్ భూపాలపల్లి-3, జోగుళాంబ గద్వాల, సిద్ధిపేట్ జిల్లాల్లో అయిదు చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
నల్లగొండ-6, నారాయణ్ పేట్-7, వికారాబాద్-9 కేసులు రికార్డు అయ్యాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. కాగా.. ఆదిలాబాద్-14, భద్రాద్రి కొత్తగూడెం-17, జనగామ-21, కామారెడ్డి-36, కరీంనగర్-51, ఖమ్మం-18, మహబూబ్ నగర్-38, మహబూబాబాద్-29, మంచిర్యాల-27, మెదక్-21, ములుగు-12, నాగర్ కర్నూలు-46, నిజామాబాద్-32, పెద్దపల్లి-16, రాజన్న సిరిసిల్ల-27, సంగారెడ్డి-61, సూర్యాపేట్-22, వరంగల్ రూరల్-21, యాదాద్రి భువనగిరి-11 కేసులు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.