తెలంగాణలో సేమ్ సీన్: వరుసగా రెండో రోజూ రెండువేలకు పైగా: హైదరాబాద్లో బీభత్సంగా
హైదరాబాద్: తెలంగాణలో కొద్దిగా తగ్గముఖం పట్టినట్టు కనిపించిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. మామూలుగా కాదు.. బీభత్సంగా పెరిగాయి..రెట్టింపు అయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా రెండువేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటితో పోల్చుకుంటే.. ఒక్కసారిగా కరోనా విజృంభించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సహా.. పలు జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరణాల సంఖ్యలో కూడా స్వల్పంగా పెరుగుదల కనిపించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం: వాయుగుండంగా?: ఏపీలో నాలుగు రోజుల పాటు మరిన్ని వర్షాలు
24 గంటల్లో 2,096 కేసులు
తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 2,096 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 73,050కు చేరుకుంది. ఇందులో 52,103 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 589కి పెరిగింది. యాక్టివ్ కేసులు 20,358గా నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే బులెటిన్ను విడుదల చేసింది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య క్రమంగా మెరుగుపడుతోంది. అరలక్షను దాటింది.
జీహెచ్ఎంసీలో అదే దూకుడు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. ఇటీవలే జీహెచ్ఎంసీలో అత్యల్పంగా కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇక తగ్గుముఖం పట్టిందని భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా నెలకొంది. ఒక్కసారిగా కేసుల్లో పెరుగుదల చోటు చేసుకుంది. తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్లో 535 కేసులు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, కరీంనగర్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
జిల్లాలవారీగా కేసుల వివరాలివీ..
ఆదిలాబాద్-17, భద్రాద్రి కొత్తగూడెం-36, జగిత్యాల-28, జనగామ-26, జయశంకర్ భూపాలపల్లి-21, జోగుళాంబ గద్వాల-72, కామారెడ్డి-28, కరీంనగర్-123, ఖమ్మం-64, మహబూబ్ నగర్-48, మహబూబాబాద్-16, మంచిర్యాల-43, మెదక్-18, మేడ్చల్ మల్కాజ్గిరి-126, ములుగు-27, నాగర్ కర్నూలు-22, నల్లగొండ-52, నారాయణపేట్-6, నిర్మల్-25, నిజామాబాద్-91,పెద్దపల్లి-54, రాజన్న సిరిసిల్ల- 83, రంగారెడ్డి-169, సంగారెడ్డి-101, సిద్ధిపేట్-20, సూర్యాపేట్-34, వికారాబాాద్-9, వనపర్తి-34, వరంగల్ రూరల్-24, వరంగల్ అర్బన్-128, యాదగిరి భువనగిరి-12 కేసులు 24 గంటల వ్యవధిలో నమోదు అయ్యాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు.
Recommended Video
ముమ్మరంగా శాంపిళ్ల పరీక్షలు..
24 గంటల వ్యవధిలో మొత్తం 21,346 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 5,043,489కి చేరుకుంది. రోజూ కనీసం 40 వేల వరకు కరోనా టెస్టులను నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో ముమ్మరంగా శాంపిళ్ల టెస్టులను కొనసాగిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.