హైదరాబాద్..కరోనా హాట్స్పాట్గా మారుతుందా?: ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవట్లేదా?
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొత్త అనుమానాలకు కారణమౌతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. హైదరాబాద్లో రోజువారీ కరోనా కేసులు హాట్ టాపిక్గా మారాయి. కరోనా లేనట్టుగానే వ్యవహరిస్తోన్న నేతల ప్రచార శైలి పట్ల విమర్శలూ వ్యక్తమౌతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వస్తోన్న నేతలెవరూ ఎలాంటి ముందు జాగ్రత్తలను తీసుకోవట్లేదని, ఫలితంగా- వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం లేకపోలేదనే చర్చ సాగుతోంది.
24 గంటల్లో 805 కేసులే..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 805 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మరణించారు. 948 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,69,223కు చేరుకోగా.. ఇందులో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,57,278 మంది ఉన్నారు.
1,455 మంది మృత్యువాత పడ్డారు. రోజువారీ కొత్త కేసులు తగ్గడం, అదే సమయంలో డిశ్చార్జీలు పెరగడం వల్ల రోగుల సంఖ్యా క్షీణిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు 10 వేలకు క్షీణిస్తున్నాయి. తాజాగా 10,490 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 8,367 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
జీహెచ్ఎంసీలో 131 కేసులు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 131 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్లో నమోదవుతోన్న రోజువారీ కరోనా కేసులు సోషల్ మీడియాలో చర్చనీయాంశమౌతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతూ కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు. హైదరాబాద్ పరిధిలో మొత్తం పేషెంట్ల సంఖ్యను ఎందుకు ప్రకటించట్లేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద నవంబర్ మొదటి వారం కన్నా ఎన్నికల ప్రచారం ఆరంభమైన చివరి మూడు వారాల్లో పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపించకపోవడం సందేహాలకు తావిస్తోందని అంటున్నారు.
జిల్లాలవారీ లెక్కలివీ..
జిల్లాలవారీగా ఆదిలాబాద్-10, భద్రాద్రి కొత్తగూడెం-42, జగిత్యాల-56, జనగామ-3, జయశంకర్ భూపాలపల్లి-9, జోగుళాంబ గద్వాల-5, కామారెడ్డి-13, కరీంనగర్-35, ఖమ్మం-40, కొమరంభీమ్ ఆసిఫాబాద్-4, మహబూబ్నగర్-15, మహబూబాబాద్-17, మంచిర్యాల-18, మెదక్-11, మేడ్చల్ మల్కాజ్గిరి-82, ములుగు-15, నాగర్ కర్నూల్-11, నల్లగొండ-32, నారాయణపేట్-2, నిర్మల్-7, నిజామాబాద్-15, పెద్దపల్లి-21, రాజన్న సిరిసిల్ల-22, రంగారెడ్డి-58, సంగారెడ్డి-24, సిద్ధిపేట్-17, సూర్యాపేట్-22, వికారాబాాద్-9, వనపర్తి-8, వరంగల్ రూరల్-11, వరంగల్ అర్బన్-27, యాదాద్రి భువనగిరి-13 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
55 లక్షలకు చేరువగా కరోనా నిర్దారణ పరీక్షలు..
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 46,208 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 54,20,421గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,45,631 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.