తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు: 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్: సెకెండ్ వేవ్ లేనట్టే?
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా సెకెండ్ వేవ్ కనిపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో దాని ప్రభావం దాదాపుగా లేనట్టే. రోజురోజుకూ తగ్గుతోన్న కరనా కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. సెకెండ్ వేవ్ పరిస్థితులు తెలంగాణ దరిదాపుల్లో లేవని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా మరణాలు కూడా పరిమితంగా ఉంటున్నాయి.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 894 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మరణించారు. 1,057 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,61,728కి చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,47,790గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1,423కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు 12,515గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 10,245 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రేటర్ హైదరాబాద్లో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి రోజువారీ కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ. అలాగే- 10 జిల్లాల్లో కరోనా కేసులు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యాయి. జిల్లాల వారీగా ఆదిలాబాద్-9, భద్రాద్రి కొత్తగూడెం-54, జగిత్యాల-32, జనగామ-17, జయశంకర్ భూపాలపల్లి-8, జోగుళాంబ గద్వాల-8, కామారెడ్డి-10, కరీంనగర్-36, ఖమ్మం-39, కొమరంభీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్నగర్-8, మహబూబాబాద్-10, మంచిర్యాల-24, మెదక్-11, మేడ్చల్ మల్కాజ్గిరి-84, ములుగు-16, నాగర్ కర్నూలు-12, నల్లగొండ-48, నారాయణపేట్-8, నిర్మల్-8, నిజామాబాద్-14, పెద్దపల్లి-28, రాజన్న సిరిసిల్ల-9, రంగారెడ్డి-70, సంగారెడ్డి-32, సిద్ధిపేట్-21, సూర్యాపేట్-22, వికారాబాాద్-7, వనపర్తి-5, వరంగల్ రూరల్-18, వరంగల్ అర్బన్-41, యాదాద్రి భువనగిరి-25 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 39,448 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 50,50,612గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,35,696 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.