నేడే మండలిలో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం...
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఖరారు చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు సోమవారం(నవంబర్ 16) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి,ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న,మాజీ మంత్రి బస్వరాజు సారయ్య,ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్లు ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ముగ్గురి ఎంపికకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఆదివారం(నవంబర్ 15) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ ముగ్గురు మండలికి అధికారికంగా ఎంపికయ్యారు.
Recommended Video
హోంక్వారంటైన్లోకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత: ఆ ఎమ్మెల్యే అభినందనలే కారణం
వ్యూహాత్మకంగా...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీల ఎంపిక పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. కొత్తగా ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టబోతున్న ముగ్గురు.. జీహెచ్ఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా తమ పేర్లను నమోదుచేసుకోనున్నారు. సాధారణంగా గవర్నర్ కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు ఈ వెసులుబాటు ఉంటుంది. తద్వారా గ్రేటర్ ఎన్నికల్లో వీరికి ఓటు హక్కు లభిస్తుంది. ఒకవేళ ఎన్నికల్లో బొటాబొటి సీట్లు మాత్రమే వస్తే.. ఎక్స్ అఫిషియో ఓట్లతో గట్టెక్కవచ్చు.
సామాజిక సమతూకం...
ఎమ్మెల్సీల ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమతూకం పాటించారు. ఎస్సీ,బీసీ,ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఎమ్మెల్సీలుగా నియమించారు. ప్రజాకవి,మహా వాగ్గేయకారుడిగా గుర్తింపు పొందిన గోరటి వెంకన్న ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు కాగా... మాజీ మంత్రి బస్వరాజు సారయ్య రజక సామాజిక చెందినవారు. గతంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన మూడుసార్లు గెలుపొందారు. కిరణ్ కుమార్ కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. 2016లో టీఆర్ఎస్లో చేరారు. ఇక మూడో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ వైశ్య సామాజికవర్గానికి చెందినవారు. నిజానికి దయానంద్ టీడీపీతో రాజకీయ ప్రయాణాన్ని ఆరంభించారు. 2014లో టీఆర్ఎస్లో చేరారు. వాసవీ సేవా కేంద్రం, వాసవీ సహకార హౌజింగ్ సొసైటీల్లో కీలక పదవుల్లో ఉన్నారు.
కర్నె ప్రభాకర్కు దక్కని ఛాన్స్..
మొత్తం 40 మంది సభ్యులున్న శాసన మండలిలో గవర్నర్ కోటా కింద 6 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. గతంలో గవర్నర్ కోటా కింద ఎస్టీ సామాజిక వర్గం నుంచి రాములు నాయక్, ఓసీ నుంచి నాయిని నర్సింహా రెడ్డి, బీసీ సామాజికవర్గం నుంచి కర్నె ప్రభాకర్ ఎన్నికయ్యారు. 2018లో కాంగ్రెస్లో చేరడంతో టీఆర్ఎస్ నుంచి రాములు నాయక్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల కన్నుమూసిన మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 19న ముగిసింది. కర్నె ప్రభాకర్ పదవీ కాలం ఈ ఏడాది అగస్టు 18న ముగిసింది. నాయిని మరణంతో ఆయన కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ దక్కవచ్చునన్న ప్రచారం జరిగింది. అలాగే కర్నె ప్రభాకర్కు మరోసారి అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇరువురికి భంగపాటు తప్పలేదు.