పెళ్లయిన ఐదు రోజులకే... అత్తారింట్లో నవ వధువు ఆత్మహత్య..
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల గ్రామంలో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన ఐదు రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి చెందిన పెసరు రాజమల్లు-మల్లమ్మ దంపతుల నాలుగో కుమార్తె మమతకు గతంలో వివాహమై విడాలకులు అయ్యాయి. పొట్యాల గ్రామానికి చెందిన మస్కం రాయమల్లు అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఏకైక కుమారుడు మస్కం స్వామి కూడా గతంలో వివాహమై విడాకులయ్యాయి.
Recommended Video
మమతకు,స్వామికి ఈ నెల 11న ఇరువురి పెద్దలు వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా మమత కుటుంబ సభ్యులు కట్న కానుకలు సమర్పించారు. అయితే ఏమైందో తెలియదు కానీ పెళ్లయిన ఐదో రోజే... మమత ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించారు.
మృతురాలు మమత సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని పోలీసులు కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. చివరిసారిగా ఆమె ఎవరితో మాట్లాడిందన్న వివరాలను సేకరిస్తున్నారు. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక పోలీసులు వెల్లడించారు.