నవ వధువు కిడ్నాప్... వరుడి ఇంటిపై దాడి చేసి బలవంతంగా లాక్కెళ్లారు...
జగిత్యాల జిల్లాలో ఓ నవ వధువు కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంతో కుటుంబ సభ్యులే ఆమెను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భార్యను కిడ్నాప్ చేశారని నవ వరుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లాలోని పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేశ్, సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన కొంపల సమత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇందుకు సమత కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఈ నెల 7న మల్యాల మండలంలోని వీరభద్రస్వామి ఆలయంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు.
వివాహ అనంతరం సారంగాపూర్ పోలీసులను ఆశ్రయించిన కొత్త జంట... తమకు రక్షణ కల్పించాలని కోరారు. యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని వరుడు పోలీసులకు చెప్పాడు. దీంతో యువతి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి... ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసుల ఎదుట యువతి తల్లిదండ్రులు రాజీకి వచ్చినట్లే కనిపించారు.
కౌన్సెలింగ్ తర్వాత రాకేష్ సమతను వెంటబెట్టుకుని పొరండ్లలోని తన ఇంటికి వెళ్లాడు. అప్పటినుంచి ఇద్దరూ అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం(నవంబర్ 9) సమత సోదరుడు సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి పొరండ్ల గ్రామంలోని రాకేష్ ఇంటికి వెళ్లాడు. రాకేష్,అతని కుటుంబ సభ్యులపై దాడి చేసి సమతను బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లాడు. అప్పటినుంచి సమత ఆచూకీ తెలియరాలేదు. దీంతో రాకేష్ జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు సమత కోసం గాలిస్తున్నారు.