ప్రేమ పెళ్లి.. 24గం. గడవకముందే మృత్యు ఒడిలోకి.. దిగ్భ్రాంతికి గురిచేస్తున్న ఘటన..
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రోజే ఓ నవ జంట రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందింది. బైక్పై వెళ్తున్న జంటను గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆస్పత్రిలో ఆ యువకుడు కూడా మృతి చెందాడు. పెళ్లి చేసుకుని 24గంటలు కూడా గడవకముందే ఆ నవజంట మృత్యు ఒడిలోకి చేరడం ఇరువురి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
సతీశ్-మహిమ...
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడెగాం గ్రామానికి చెందిన బట్టు సతీశ్ (24) హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్లోని గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన మహిమ (22)తో కొన్నాళ్ల క్రితం అతనికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో పెద్దలకు చెప్పకుండానే హైదరాబాద్లో గురువారం(డిసెంబర్ 10) మధ్యాహ్నం 3గంటల సమయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇరువురి పెద్దల నుంచి ఎటువంటి ప్రాణహాని ఎదురవకుండా సదాశివనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి రక్షణ కోరాలనుకున్నారు. అనుకున్నట్లుగానే బైక్పై సదాశివనగర్కు బయలుదేరారు.
Recommended Video
సదాశివనగర్లో రోడ్డు ప్రమాదం..?
ఈ క్రమంలో సదాశివనగర్ జూనియర్ కాలేజీ వద్ద యూటర్న్ తీసుకుని పోలీస్ స్టేషన్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం బైక్ను వేగంగా ఢీకొట్టింది. దీంతో మహిమ అక్కడికక్కడే మృతి చెందగా సతీశ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సతీష్ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి,మహిమ మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో సతీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పెళ్లి చేసుకున్నామన్న ఆనందం కూడా తీరకముందే ఇద్దరు మృతి చెందడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.ప్రమాద ఘటనపై ఇరువురి కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతిపై అనుమానాలు..
నవ జంట మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం తర్వాత పోలీసులు ఒకరిని కామారెడ్డికి, మరొకరిని నిజామాబాద్కు ఎందుకు తరలించారనే సందేహాలు తలెత్తుతున్నాయి. సతీశ్కు కేవలం ముఖంపై మాత్రమే గాయాలు ఉండడంతో.. రోడ్డు ప్రమాదమే వీరి మృతి కారణమా లేక ఎవరైనా వారిపై దాడి చేసి అక్కడ పడేసి ఉంటారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. గురువారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తమ కూతురు మళ్లీ తిరిగిరాలేదని మహిమ తల్లి నిర్మల పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.