పెళ్లయిన 5 రోజులకే ఊహించని విషాదం: స్వీట్స్ కోసం వెళ్లి వరుడు మృతి
కొత్తగూడెం: పెళ్లయిన ఐదు రోజులకే ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. బైక్ పై వెళ్తున్న సమయంలో.. ముందు వెళ్తున్న ఓ ఎద్దుల బండిని ఢీకొట్టి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొట్టెల గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఎవరతను?:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన పుణ్యం సాంబయ్య(24), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన ఓ యువతితో ఈ నెల 3న వివాహం జరిగింది. ఇద్దరు కలిసి సోమవారం వెంకటేశ్వరపురం వెళ్లారు.
స్వీట్స్ తెచ్చేందుకు:
కొత్త జంట ఇంటికి రావడంతో వారికి అతిథి మర్యాదలు బాగానే జరిగాయి. ఇదే క్రమంలో స్వీట్స్ తెచ్చేందుకని సాంబయ్య సాయంత్రం బైక్ పై మణుగూరు బయలుదేరాడు. అతని వెంట బంధువు రేగళ్ల ఆదినారాయణ కూడా ఉన్నాడు. మార్గమధ్యలో గొట్టెల గ్రామం వద్ద సాంబయ్య బైక్ ఓ ఎద్దుల బండిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదినారాయణ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తీవ్ర విషాదం:
పెళ్లయిన ఐదు రోజులకే వరుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. భర్త మృతి వార్తను తట్టుకోలేక నవ వధువు కననీరుమున్నీరుగా విలపించింది. సాంబయ్య కుటుంబ పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. అతని తల్లికి ఇటీవలే రెండుసార్లు కిడ్నీ ఆపరేషన్ జరిగింది. సాంబయ్య స్థానిక వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.
తల్లికి తోడుగా ఉంటుందనుకున్నాడు..:
పనిచేస్తూ కూడబెట్టిన డబ్బుతోనే చెల్లెలి వివాహం కూడా జరిపించాడు సాంబయ్య. అనారోగ్యం పాలైన తల్లికి అప్పులు చేసి మరీ వైద్యం అందించాడు. కొత్త కోడలు తల్లికి తోడుగా ఉంటుందని ఆశించాడు. కానీ ఇంతలోనే అతను రోడ్డు ప్రమాదంలో తనువు చాలించడంతో వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.