పెళ్లయిన నాలుగు నెలలకే!: ఆ వేధింపులే బలితీసుకున్నాయి?, తల్లడిల్లుతోన్న తల్లిదండ్రులు..
హైదరాబాద్: ఆడపిల్ల పుట్టిందని వేధించడం.. అదనపు కట్నం కోసం హింసించడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. పెళ్లయి నెలలు గడవకముందే కట్నం కాపురంలో చిచ్చు పెడుతోంది. చివరకు వారి ప్రాణాలను బలితీసుకునేదాకా ఆ పరిస్థితులు వెళ్తున్నాయి.
అదనపు కట్నం కోసం అత్తింటివారు పెట్టే వేధింపులు భరించలేక తాజాగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన నాలుగు నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.
లావణ్య-శివ:
నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం, చలకులపల్లి గ్రామానికి చెందిన యాదమ్మ కుమార్తె లావణ్య(25)కు లింగరాశిపల్లికి చెందిన భారత్మ కుమారుడు శివ అలియాస్ ఆనంద్తో ఈ ఏడాది అగస్టులో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.5లక్షలు కట్నంగా ఇచ్చారు.
అదనపు కట్నం వేధింపులు:
పెళ్లి తర్వాత ఎల్బీనగర్, శివగంగ కాలనీలో కాపురం పెట్టారు. శివ స్థానికంగా ఓ ప్రైవేట్ షోరూంలో పనిచేసేవాడు. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే అతను ఉద్యోగం మానేశాడు. అప్పటినుంచి అదనపు కట్నం కోసం భార్య లావణ్యను వేధిస్తున్నాడు.
భర్త వేధింపులకు తోడు అత్తింటి వారు కూడా ఆమెను సూటిపోటీ మాటలతో వేధించారు. అంతేకాదు, లావణ్య రెండు నెలల గర్భవతి కావడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.
మనస్తాపంతో ఆత్మహత్య
ఒకే ఇంట్లో ఉంటే గొడవలు తీవ్రం అవుతుండటంతో ఇటీవల వేరు కాపురం పెట్టారు. ఎన్టీఆర్నగర్, రాజీవ్గాంధీనగర్లో మరో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అయినా వేధింపులకు ఫుల్ స్టాప్ పడకపోవడంతో లావణ్య తీవ్ర మనస్తాపానికి గురైంది.
భర్త శివ సోమవారం ఉదయం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుంది. బయటకెళ్లి వచ్చిన శివ.. ఇంట్లో భార్య ఉరివేసుకుని ఉండటం చూసి షాక్ తిన్నాడు. వెంటనే లావణ్య తల్లికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు.
వాళ్లను కఠినంగా శిక్షించాలి:
లావణ్య ఆత్మహత్యపై సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
అత్తింటివారి వేధింపులు తాళలేకనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి యాదమ్మ, సోదరుడు ధర్మానాయక్ ఆరోపిస్తున్నారు. రూ.2లక్షలు అదనపు కట్నం తీసుకురాకపోతే రెండు నెలల గర్భాన్ని తీయించేస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పారు. లావణ్యమృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.