News makers: సజ్జనార్: ఎ మ్యాన్ ఆన్ ఫైర్: అత్యాచార నిందితుల పాలిట సింహస్వప్నం
హైదరాబాద్: ఈ ఏడాది చివరి నెల.. మొదటి వారంలో చోటు చేసుకున్న ఓ ఘటనను బహుశా- రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం ఇప్పట్లో మరిచి పోలేకపోవచ్చు. దేశం మొత్తాన్నీ ఏకం చేసిన ఉదంతం అది. ప్రశంసలు, విమర్శలూ సమంగా స్వీకరించిన సంచలనాత్మక సంఘటన అది. దానికి కారణమైనది ఒకే ఒక్కరు.. ఆయనే సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమిషనర్. ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడాలంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే అనేంతగా భయం పుట్టిచ్చిన ఐపీఎస్ అధికారి.
Saaho Sajjannar: ఆనంద డోలికల్లో తెలంగాణ: సజ్జన్నార్ చిత్రపటానికి పాలాభిషేకం: బాణాసంచా కాల్చుతూ..
రెండు ఎన్ కౌంటర్లకు దిశా నిర్దేశం..
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును సైబరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన తెల్లవారు జామున చటాన్ పల్లి ఫ్లైఓవర్ కింద చోటు చేసుకున్న ఈ ఘటనపై దేశం మొత్తం స్పందించింది. ఈ ఎన్ కౌంటర్ కు దిశానిర్దేశం చేసిన సజ్జన్నార్ పేరు మారుమోగిపోయింది. ఈ ఏడాది న్యూస్ మేకర్ గా నిలిపింది.
నాడు వరంగల్ లో..
రెండు ఎన్ కౌంటర్లు. ఒకటి వరంగల్ లో.. ఇంకొకటి హైదరాబాద్ లో. అమ్మాయిల జోలికి వెళ్లిన నిందితులకు సజ్జన్నార్ తనదైన శైలిలో విధించిన శిక్ష ఇది. ఈ రెండు ఎన్ కౌంటర్ల చోటు చేసుకున్న సమయాల్లోనూ పోలీసులకు దిశా నిర్దేశం చేసిన అధికారి ఆయనే. ఆటవికంగా అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేయడం ఒక్కటే ప్రత్యామ్నాయమనే సందేశాన్ని ఇచ్చారాయన.
యాసిడ్ దాడిలో
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఇద్దరు యువతులపై యాసిడ్ దాడి చోటు చేసుకున్న ఘటనలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. 2008 డిసెంబర్ 10లో ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ లోని కిట్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు వారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నస్వప్నిక తన న స్నేహితురాలు ప్రణీతతో కలిసిన స్కూటర్ పై ఇంటికి వెళుతుండగా శ్రీనివాస్ అనే యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ సమయంలో వరంగల్ ఎస్పీగా ఉన్నది సజ్జన్నారే. ఇప్పుడు ఈ కేసు కూడా పర్యవేక్షించినది ఆయనే. ఆయన హయాంలోనే యాసిడ్ దాడి నిందితులను ఎన్ కౌంటర్ చేశారు.
హీరోగా గుర్తింపు..
వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి మహిళలు.. పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా మహిళలు స్వయంగా, స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వస్తుండటం.. ఈ ఎన్ కౌంటర్ పట్ల వారిలో నెలకొన్న సంతోషానికి అద్దం పట్టింది. ఈ ఎన్ కౌంటర్ కు ప్రధాన మార్గదర్శకుడిగా, పోలీసులకు దిశా, నిర్దేశం చేసినట్లుగా భావిస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ ప్రస్తుతం తెలంగాణ ప్రజల దృష్టిలో హీరోగా మారిపోయారు.