ప్రధాని కావాలని ఆశ లేదంటున్న కేసీఆర్ .. తమ నేత పీఎం ఎలా అవుతాడో లెక్కలు చెప్తున్న టీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్ : దేశంలో అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి పోస్ట్. జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించే నేతల కన్ను ఆ పోస్టుపైనే .. ప్రస్తుత ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ పీఎం పీఠంపై కన్నెశారు. వీరితోపాటు ప్రాంతీయ పార్టీల నేతల చూపు కూడా ప్రధాని పదవీపై పడింది. అందులో ఒకరు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రధాని పోస్టుపై తనకు ఇంట్రెస్ట్ లేదని, తెలంగాణ మాదిరిగా దేశం అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష కేసీఆర్ ఇదివరకే స్పష్టంచేశారు. అయితే కాబోయే పీఎం కేసీఆర్ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు.
ఎర్రబెల్లి అంచనా ?
రాష్ట్రంలో టీఆర్ఎస్ నినాదం కారు, పదహారు, సర్కార్తో ముందుకుసాగుతోంది. జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తామని కేసీఆర్ పదే పదే ప్రకటిస్తున్నారు. జాతి సంక్షేమం కోసం దేశ రాజకీయాల్లోకి వెళతానని, మీ ఆశీర్వాదం కోరుతున్నానని పేర్కొన్నారు. అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తానని తెలిపారు. ఇంతవరకు ఓకే .. కానీ మంత్రి ఎర్రబెల్లి మాత్రం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేయడం పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది. ఇంతకీ ఎర్రబెల్లి అంచనా ఏంటీ ? జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పీఎం పీఠం అధిష్టించడం అంతా వీజీ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదీ లెక్క
నిన్న వరంగల్లో టీఆర్ఎస్ సభ జరిగింది. అందరిలాగే మైకు తీసుకొని ఎర్రబెల్లి ప్రసంగించారు. రొటిన్ ఏముంటుంది అనుకున్నారో ఏమో .. తమ సారు ఢిల్లీని ఏలుతారని ప్రకటించారు. ఏలా అంటే గతంలో వరంగల్లోని ఆజంజహీ మిల్లు గ్రౌండ్లో సభకు హాజరైన నేతలు ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. ఇదివరకు నెహ్రూ కూడా ఇక్కడ సభలో ప్రసంగించి, ప్రధాని పదవీ చేపట్టారని తెలిపారు. ఆ తర్వాత చాలారోజులకు తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు కూడా ఆజంజహీ మిల్లు గ్రౌండ్లో జరిగిన సభకు విచ్చేశాకే పీఏం అయ్యారని తెలిపారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కేసీఆర్ కూడా భావి భారత ప్రధాని అని అభివర్ణించారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
పైకి లేదంటూనే .. లోలోన అంతర్మథనం
ఎర్రబెల్లి అంచనాలపై సీఎం కేసీఆర్ ఆచితూచి స్పందించారు. తనకు పీఎం పదవీ చేపట్టడం ఇంట్రెస్ట్ లేదని ముక్తాయించారు. కానీ దేశ సంక్షేమం ముఖ్యమని ఉద్ఘాటించారు. పీఎం పోస్టు అంటే ఇంట్రెస్ట్ లేని కేసీఆర్ .. జాతీయ రాజకీయాలకు వెళ్తానడంతో ఆంతర్యం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా సభలు, సమావేశాలకు సంబంధించి చర్చించే ముందు, జాతకాలు, జ్యోతిష్యం ప్రకారం నడుచుకునే కేసీఆర్, ఆజంజహీ మిల్లు గ్రౌండ్ నేపథ్యం గురించి తెలిసి మరీ ఎన్నికల ప్రచారం ఎందుకు చేశారనే వాదన తెరపైకి వచ్చింది. మొత్తానికి దేశ రాజకీయాల్లో కీ రోల్, అదీ కూడా పీఎం పోస్టుపై కేసీఆర్ కన్నేశారని ఆయన అంతరంగాన్ని బట్టి అర్థమవుతోంది. అయితే గతంలో లాగా ఆజంజహీ మిల్లు గ్రౌండ్ సాంప్రదాయం కొనసాగిస్తోందా ? లేదా కొత్త చరిత్ర సృష్టిస్తోందా అనేది తేలాలంటే .. ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు నిరీక్షించాల్సిందే.