జయలలిత చికిత్స, మృతిపై సిబీఐతో విచారణ: సుప్రీంకు తెలుగు సంస్థ
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య మరణం పైన చెన్నైకు చెందిన స్వచ్చంధ సంస్థ ఒకటి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య మరణం పైన చెన్నైకు చెందిన స్వచ్చంధ సంస్థ ఒకటి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది. ఊహించనిరీతిలో ఆమె కన్నుమూయడం, ఆమెను పరామర్శించేందుకు బంధువులు సహా ఎవరినీ అనుమతించక పోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ ఎన్జీవో సంస్థ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది. జయలలిత మరణం పైన సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)తో విచారణ జరిపించాలని సుప్రీంను కోరింది. అలాగే ఆమె చికిత్సకు సంబంధించిన అన్ని వైద్య నివేదికలను స్వాధీనం చేసుకోవాలని కోరింది.
చెన్నైకి చెందిన తమిళనాడు 'తెలుగు యువ శక్తి,' అనే ఎన్జీవో ఈ పిటిషన్ దాఖలు చేసింది. జయ మృతి వెనుక రహస్యం ఏమిటో తెలియాలని అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రముఖ నటి గౌతమి, అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్పలు కూడా జయలలిత మృతి పైన అనుమానాలు వ్యక్తం చేశారు.