విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కార్ కు తలంటిన జాతీయ మానవ హక్కుల సంఘం: నోటీసులు జారీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన పరీక్షల నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మార్కుల జాబితాను తప్పుల తడకగా రూపొందించడాన్ని తప్పు పట్టింది. 18 మంది విద్యార్థులుే ఆత్మహత్య చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది.కేసీఆర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది. దీనికంతటికీ కారణమైన వారిపై తీసుకున్న చర్యలతో పాటు బాధితుల కుటుంబాలకు ఏ రకమైన సహాయ, సహకారాలను అందిస్తున్నారనే విషయాన్ని నివేదికలో పొందుపరచాలని సూచించింది.
ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ లో దారుణమైన లోపాలు తలెత్తిన విషయం తెలిసిందే. తాము పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదనే బాధతో 18 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లో పాస్ మార్కులు వచ్చినప్పటికీ.. ఫెయిల్ అయినట్టు ఫలితాలను ప్రకటించింది ఇంటర్మీడియట్ బోర్డు. దీనిపై మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడ్డాయి. వాటిని సుమోటోగా తీసుకుంది జాతీయ మానవ హక్కుల కమిషన్.
మీడియాలో వచ్చిన కథనాలు నిజమే అయితే- ఇంతటి తీవ్రమైన తప్పులకు పాల్పడిన అధికారులు మానవ హక్కులను ఉల్లంఘించినట్టేనని కమిషన్ స్పష్టం చేసింది. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోనే సమస్యను పరిష్కరించినట్టు కాదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోనివ్వబోమంటూ ప్రభుత్వం తమకు సంతృప్తికర వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ లో బోర్డు అధికారులు కాంట్రాక్టు రూపంలో ప్రైవేటు వ్యక్తులకు చోటు కల్పించడమే ఈ దారుణానికి కారణమంటూ వార్తలు వచ్చాయి. దీనిపైన కూడా వివరణ ఇవ్వాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే మానవ వనరులు ఉన్నప్పటికీ.. ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు ఎందుకు వాల్యుయేషన్ వ్యవస్థలో చోటు కల్పించారంటూ కమిషన్ ప్రశ్నించింది. నిజానికి- ఇదివరకు పరీక్షల వాల్యుయేషన్ గానీ, రీవాల్యుయేషన్ లల్లో గానీ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విభాగం భాగస్వామ్యమయ్యేది.
ఈ సారి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న గ్లోబరీనా టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థకు వాల్యుయేషన్ కాంట్రాక్టును అప్పగించింది ప్రభుత్వం. లక్షలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీసుకెళ్లి ఓ ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టడంతో వారు ఇష్టానుసారంగా ప్రవర్తించారని, ఫలితంగా- మార్కుల జాబితాలో సరిదిద్దుకోవడానికి వీల్లేని తప్పులు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలను రాయగా.. వారిలో మూడున్నర లక్షలమంది ఉత్తీర్ణులు కాలేదంటూ ఫలితాలు వెలువడ్డాయి.