ఎన్ఐఏ విచారణకు ఖాదిర్, ఐసిస్ ఉగ్రవాదిని పెళ్లాడాలనుకున్న సన?
హైదరాబాద్: పాతబస్తీలో సోమవారం ఉగ్రకలకలం చెలరేగింది. 2016లో నమోదైన ఐఎస్ఐఎస్ కేసుకుసంబంధించిన తదుపరి దర్యాఫ్తులో భాగంగా జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పలువురు అనుమానితులకు నోటీసులు ఇచ్చారు. ఎన్ఐఏ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
పాతబస్తీలో ఎన్ఐఏ బృందాల సెర్చ్ ఆపరేషన్: పలువురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్
ఈ నేపథ్యంలో మంగళవారం కొందరు విచారణకు హాజరయ్యారు. బుధవారం మరికొందరు హాజరు కానున్నారని తెలుస్తోంది. సోదాల సందర్భంగా ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులో విధ్వంసానికి కుట్ర పన్నిన ఘటనకు సంబంధించి 2016లో ఏడుగురు యువకులను ఎన్ఐఏ అరెస్టు చేసిన అనంతరం మళ్లీ ఉగ్రకలకలకం చెలరేగడం గమనార్హం.
సిరియా వెళ్లి ఉగ్రవాదులను పెళ్లాడాలని సనా ప్రయత్నం
మంగళవారం అబ్దుల్ ఖాదిర్ (19), మరికొందరు ఎన్ఐఏ విచారణకు హాజరయ్యారు. సోమవారం రోజు అబ్దుల్ ఖాదిర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది. ల్యాప్టాప్తో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది యువకులు ఐసిస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ, 2016లోనే ఐసిస్ సానుభూతిపరులకు కౌన్సెలింగ్ ఇచ్చింది. అబ్దుల్ ఖాదిర్ షాహీనగర్ ఇంటర్నెట్ సెంటర్లో అతను పని చేస్తున్నాడు. బాసిత్, సనా అనే ఇద్దరికి ఉగ్రవాదులతో ఖాదిర్ పరిచయాలు చేయించినట్లుగా అనుమానిస్తున్నారు. సనా సిరియా వెళ్లి ఉగ్రవాదులను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
ఆ ముగ్గురిని విచారించగా
ఐసిస్ ఉగ్రవాద భావజాలానికి హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువకులను మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు 2015 డిసెంబర్లో నాగపూర్లో అరెస్టు చేశారు. మాజ్, బాసిత్, ఒమర్ అనే ముగ్గురు యువకులు అంతకుముందు కోల్కతా మీదుగా బంగ్లాదేశ్ వెళ్లేందుకు ప్రయత్నించగా బెంగాల్ పోలీసుల సహకారంతో హైదరాబాద్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వీరిలో మార్పు రాలేదు. మళ్లీ నాగపూర్ మీదుగా శ్రీనగర్ వెళ్లి ఆప్గనిస్తాన్ వెళ్లే ప్రయత్నంలో ఏటీఎస్ అధికారులకు దొరికారు.
ఆ ముగ్గురి విచారణలో కీలక విషయాలు
వీరిని విచారించగా అబుదబీకి చెందిన షేక్ అజర్ ఉల్ ఇస్లాం, అద్నాన్ హసన్, మహ్మద్ ఫరాన్ షేక్ అనే వ్యక్తులు తమను ప్రేరేపించారని తెలిపారు. అవసరమైన ధనసాయం చేశారని తెలిపారు. ఆ తర్వాత 2016 జనవరిలో ఆ ముగ్గురిని అబుదబి నుంచి అక్కడి ప్రభుత్వం భారత్ పంపించింది. వారిని ఎన్ఏఐ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసి, విచారించారు. ఇదిలా ఉండగా, హైదరాబాదుకు చెందిన హన్నన్ ఖురేషీ, అద్నాన్ అహ్మద్, సన, ఖలీద్ అహ్మద్, మహ్మద్ లతీవుద్దీన్, అబ్రార్, మాజ్, ఫరూకీ, అధ్నాన్, నోమన్, లతీఫ్ అనే పదకొండు మందితో పాటు షాహిన్ నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్లతో అబుదబీ నుంచి వచ్చిన ముగ్గురుతో ఇంటర్నెట్ ద్వారా సంప్రదింపులు ప్రారంభించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. భారత్లో ఉగ్రవాద వ్యాప్తికి వీరు ప్రయత్నించినట్లు గుర్తించారు. దీంతో సోమవారం ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో సన సిరియా వెళ్లి ఐసిస్ ఉగ్రవాదులను పెళ్లి చేసుకోవాలని భావించిందని గుర్తించారని తెలుస్తోంది.
నా కొడుకు ప్రచారం చేస్తాడు, అంతకుమించి తెలియదు
అబ్దుల్ ఖాదిర్ తండ్రి ఖుద్దూస్ సోమవారం సాయంత్రం మాట్లాడుతూ.. పోలీసులుఉదయం తమ ఇంటికి వచ్చారని, తమ కుమారుడు మహ్మద్ అబ్దుల్ ఖదిర్ గురించి ప్రశ్నించారని చెప్పారు. తమది జయశంకరం భూపాలపల్లి జిల్లా అని, తాను అనాథాశ్రమంలో పని చేస్తున్నానని, తన కుమారుడు ఖదిర్ పదో తరగతి తప్పాడని, ఇంట్లో ఉంటున్నాడన్నారు. తన కొడుకు మసీదుల వద్ద ప్రచారం చేస్తున్నాడని, అంతకు మించి తనకేమీ తెలియదన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని అధికారులు తనకు చెప్పారన్నారు.