‘‘నా దగ్గర రూ.కోట్లు ఉన్నాయి.. నమ్మకస్తులే తగల్లేదు.. మీరు ‘ఊ’ అంటే రూ.5 కోట్లు పంపిస్తా..’’
‘‘మీ భావాలు చాలా బాగున్నాయి. మీలాంటి వ్యక్తులు నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ కావడం నా అదృష్టం. నావద్ద కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఎవరినీ నమ్మాలో, ఎవరికీ ఇవ్వాలో తెలియడం లేదు...’’
హైదరాబాద్: నైజీరియన్ సైబర్ క్రిమినల్స్ మాయమాటలతో చాలా మందిని నిండా ముంచేస్తున్నారు. సామాజిక సేవ ఆలోచనలు ఉన్నవారికి గాలం వేస్తూ వారిని సులభంగా కొల్లగొడుతున్నారు.
ఇటీవల కాలంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ తరహ మోసాలతో దాదాపు 5 మందిని కొల్లగొట్టారు. వీరి వద్ద నుంచి దాదాపు రూ.30 లక్షలకు పైగా నగదును దోచేశారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని ఆపైన పని కానిచ్చేస్తున్నారు.
మీ భావాలు చాలా బాగున్నాయి...
‘‘మీ భావాలు చాలా బాగున్నాయి. మీలాంటి వ్యక్తులు నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ కావడం నా అదృష్టం. మీ సేవా ధృ క్పథం నన్ను కూడా సామాజిక సేవ చేయాలని ప్రేరేపిస్తుంది. నావద్ద కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఎవరినీ నమ్మాలో, ఎవరికీ ఇవ్వాలో తెలియడం లేదు. ఇచ్చినా వారు నమ్మకంగా సేవ చేస్తారో లేదో తెలియదు..'' అంటూ వల విసురుతున్నారు.
మీరు ఊ అంటే.. రూ.5 కోట్లు పంపిస్తాను
అంతేకాదు - ‘‘నేను మూడు నెలలుగా ఫేస్బుక్లో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీ భావాలు అద్భుతం. నేను కూడా మీతో కలిసి సమాజ సేవ చేయాలనుకుంటున్నాను. అందుకు మీరు ఓకే అంటే మీకు ఓ రూ.ఐదు కోట్లు పంపిస్తాను... వాటితో మీరు స్వచ్ఛంద సేవలు ప్రారంభించండి. మీ వెనకాల నేను ఉంటాను..'' అని మాయ మాటలు చెబుతూ బురిడీ కొట్టిస్తున్నారు.
ఆర్బీఐ క్లియరెన్స్ కోసం...
ఎవరైనా కాస్త అనుమాన పడితే, నగదు రాసిన చెక్కులు, బాక్సులో డబ్బులు ఉన్న ఫొటోలు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన లేఖల ఫొటోలు పంపి అమాయకులను ఇట్టే బోల్తా కొట్టిస్తున్నారు. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్లు చేసి, మీ పేరు మీద నగదు వచ్చింది... ఆర్బీఐ క్లియరెన్స్ చేయాలి.. అంటూ ముందుగా లక్షల రూపాయలు డిపాజిట్ చేయించుకుని మోసం చేస్తున్నారు.
ఆశ పడితే బుట్టలో పడినట్లే...
పాపం.. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇలాగే నైజీరియన్ల మాయలో పడింది. తనకు రూ.కోట్లు వచ్చేస్తున్నాయని ఆశపడింది. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పినా జీర్ణించుకోలేరని భావించి ఆ విషయాన్ని రహస్యంగా ఉంచింది. అంతేకాదు - ఈ విషయం తెలిసి ఆమె సోదరుడు ప్రశ్నించగా, నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నావా అంటూ అతడితో గొడవపడి దాదాపు నెల రోజుల పాటు మాట్లాడలేదు కూడా.
ముందుగా డిపాజిట్ అంటూ...
చివరకు ఆ యువతి రూ.9.50 లక్షలను ఆన్లైన్లో సైబర్ క్రిమినల్స్ డిపాజిట్ చేయమన్న అకౌంటులో వేసి మోసపోయింది. మరో స్వచ్ఛంద సంస్థ కార్యకర్తకు ఇలాగే మాయమాటలు చెప్పి.. రూ.10 కోట్లు పంపిస్తామని చెప్పిన సైబర్ క్రిమినల్స్ ముందుగా కాస్త డబ్బు డిపాజిట్ చేయాలంటూ రూ.6 లక్షలను దోచేశారు.
అప్రమత్తత అవసరం...
మరో కేసులో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నుంచి ఇలాగే రూ.8 లక్షలను కొల్లగొట్టారు. ఇలా దాదాపు ఐదు కేసులలో బాధితులు లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు. అందుకే ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. రూ.కోట్లు వచ్చేస్తున్నాయని ఎవరైనా చెబితే నమ్మవద్దని చెబుతున్నారు.
ఆరా తీయడం బెటర్...
వ్యక్తిగతంగా పరిచయం లేని వారి మాటలు విశ్వసించవద్దని పేర్కొంటున్నారు. కస్టమ్స్ అధికారులు, ఆర్బీఐ అధికారులు, క్లియరెన్స్ సర్టిఫికెట్లు అనగానే బోల్తా పడరాదని, స్వచ్ఛంద సంస్థల నుంచి అంటే మొదట ఆ సంస్థల గురించి ఆరా తీయమని వారు సూచిస్తున్నారు.