అలా చెప్పగానే రూ.6.51లక్షలు ఇచ్చింది: నిండా ముంచిన ఆ పరిచయం, పెళ్లి పేరుతో!
హైదరాబాద్కు చెందిన ఓ మహిళ ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారు. అందులో భూమిష్ దీపక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
హైదరాబాద్: పెళ్లి పేరుతో మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా యువతులకు గాలం వేస్తున్న ఘటనలు ఈమధ్య కాలంలో పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ మహిళ కూడా ఇలాగే మోసపోయింది.
హలిబుర్టాన్ అయిల్ సర్వీసెస్లో జియాలజిస్ట్గా పనిచేస్తున్నానని యువతితో పరిచయం పెంచుకున్న సదరు వ్యక్తి.. ఆమెను తనవైపు తిప్పుకోవడంలో సఫలమయ్యాడు. చాటింగుల ద్వారా దగ్గరయ్యాడు. తనకో కూతురు ఉందని చెప్పినా.. యువతి పెళ్లికి సిద్దపడిందటే ఆమెను ఎంతలా నమ్మించాడో అర్థం చేసుకోవచ్చు.
భూమిష్ దీపక్:
హైదరాబాద్కు చెందిన ఓ మహిళ ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారు. అందులో భూమిష్ దీపక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను అంతర్జాతీయ ఆయిల్ కంపెనీలో చేస్తున్నానని డబ్బులకు కొదువ ఉండదని నమ్మబలికాడు. అంతేకాదు, తనకు పెళ్లయిందని ఎనిమిదేళ్ల కుమార్తె కూడా ఉందని చెప్పాడు. అయితే భార్య తన నుంచి వేరుగా ఉంటుండటంతో కూతురితో కలిసి ఒంటరిగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు.
సానుభూతి కలిగేలా.. అలా చెప్పగానే:
ఎనిమిదేళ్ల కూతురితో ఒంటరిగా ఉంటున్నాడని తెలియగానే యువతికి అతనిపై జాలి ఏర్పడింది. పైగా కూతురికి గుండె సంబంధిత సమస్య ఉందని చెప్పడంతో.. ఎమోషనల్గా అతనితో అటాచ్మెంట్ పెంచుకుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న అతను కూతురికి గుండెకు ఆపరేషన్ చేయించాలని అందుకోసం డబ్బు కావాలని ఆమెను అడిగాడు. కాబోయే భర్తే కదా.. అని నమ్మిన ఆమె.. పలు దఫాలుగా 30వేల మిలియన్ డాలర్లు(రూ.6.51లక్షలు) పంపించింది.
అది మరింత బలపడేలా సెంటిమెంటుతో అతను దెబ్బకొట్టాడు.
ఆరా తీస్తే నిజం తెలిసింది:
ఎందుకో అతనిపై భూమిష్ ప్రవర్తనపై అనుమానం కలిగిన యువతి.. అతను పనిచేస్తున్న కంపెనీ గురించి ఆరా తీసింది. ఆ ఆయిల్ కంపెనీలో అతను పనిచేయడం లేదని తెలియడంతో షాక్ తిన్నది. మోసపోయానని గ్రహించి ఆగస్టు 18న సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదుచేసింది. అకౌంట్, సీడీఆర్ వివరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. . కాల్ డేటా రికార్డ్స్, బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా మోసం ఢిల్లీ కేంద్రంగా ఈ మోసం జరిగినట్లు నిర్ధారించారు.
ఇద్దరి అరెస్ట్:
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన పోలీస్ బృందం నైజీరియన్లు సోడే, ఇందహోసాను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తీసుకొచ్చారు. అనేసోడే అనే వ్యక్తే ఈ మోసానికి పాల్పడినట్లు తేల్చారు.
మాట్రిమోని వెబ్సైట్లో నకిలీ ఖాతాను తెరిచాడు. బాధితురాలితో నిత్యం చాటింగ్ చేస్తుండేవాడు. ఆ తర్వాత కూతురి ఆరోగ్యం బాగాలేదని డ్రామా ఆడి డబ్బు వసూలు చేశాడు. ఇందహోసా అతడికి సహకరించాడని డీసీపీ తెలిపారు.
నిందితుల నుంచి పాస్పోర్టులు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్స్, డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సైబర్ క్రైం సిబ్బందిని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అభినందించారు.