మాజీ జెడి లక్ష్మీనారాయణ పేరుతో హోటల్ కడ్తామని నైజీరియన్ల మోసం, అరెస్ట్
హైదరాబాద్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మాజీ జెడీ లక్ష్మీ నారాయణ పేరు హోటల్ కడతామని చెప్పి మోసగించిన నైజీరియన్ ముఠాని సిసిఎస్ పోలీసులు సోమవారం నాడు అరెస్టు చేశారు. ముఠా అడ్డంగా దొరికిపోయింది.
సిబిఐ జెడి మాజీ లక్ష్మీనారాయణ పేరుతో హైదరాబాదులో హోటల్ కడతామని, దానిని ప్రజలకు అంకితం చేస్తామని చెబుతూ నైజీరియన్లు పలువురు ముఖ్యులకు చెప్పి వారి నుంచి లక్షల రూపాయల్లో డబ్బులు వసూలు చేశారు.
లక్ష్మీ నారాయణకు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న విషయం తెలిసిందే. దీనిని ఉపయోగించుకొని నైజీరియన్లు పలువురిని బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేశారు.
దీని పైన సిసిఎస్ పోలీసులకు బాధితులు ఒకరు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నైజీరియన్లతో పాటు ముగ్గురు మహారాష్ట్ర వాసులను అరెస్టు చేశారు.
ఇరు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి తమకు పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయని, లక్ష్మీ నారాయణ పేరుతో హైదరాబాదులో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కడతామని నమ్మించి వారు రూ.10 లక్షల మేర ఇప్పటి వరకు వసూలు చేశారు.