‘రజినీ, సల్మాన్తో విందు’ అంటూ నైజీరియన్ల మోసాలు: రూ. లక్షలు కాజేశారు
హైదరాబాద్: విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ల ఆట కట్టించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ‘ఇల్యుమినాటి' క్లబ్ పేరుతో నైజీరియన్లు ఓ ఇంటర్ విద్యార్థిని మోసం చేశారు. నకిలీ వెబ్సైట్లో ప్రవేశించిన సదరు విద్యార్థి నుంచి రూ.9 లక్షలు స్వాహా చేశారు.
చదువు, విజ్ఞానంతో పాటు ప్రముఖులతో పరిచయాలు, ముఖాముఖి, విందుల్లో పాల్గొనే అవకాశాలుంటాయని.. 599 అమెరికన్ డాలర్లు చెల్లించి తమ క్లబ్లో చేరాలని నైజీరియన్లు నమ్మబలికారు. ప్రముఖ నటులు రజినీకాంత్, సల్మాన్ఖాన్తోపాటు పలువురు హిందీ, తెలుగు, తమిళ హీరోయిన్లతో తరచూ మాట్లాడవచ్చని పేర్కొన్నారు.
ఆ క్లబ్ మాయలోపడ్డ సదరు విద్యార్థి.. బాగా చదువుకునేందుకు ఓ సంస్థ ఉందని, ఇంగ్లీష్ బాగా నేర్పిస్తారని, పెద్దలకు కూడా ఉపయోగపడుతుందని తన తల్లికి అబద్ధం చెప్పాడు. కుమారుడి ఒత్తిడి మేరకు ఆమె మూడునెలల వ్యవధిలో రూ.9 లక్షలను దశలవారీగా ‘రేమండ్స్ ఉడ్స్' అనే వ్యక్తి సూచించిన ఖాతాల్లో జమచేశారు.
కాగా, సదరు క్లబ్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో విద్యార్థి తల్లికి అనుమానం వచ్చి కొద్దిరోజుల క్రితం సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. ముంబైలో నివాసముంటున్న నైజీరియన్లు తప్పుడు ఖాతాలతో ఈ మొత్తాన్ని స్వాహాచేశారని గుర్తించారు.
ముంబైకి వెళ్లి పరిశోధించగా.. రేమండ్స్ ఉడ్స్ అనే వ్యక్తి అప్పటికే పరారయ్యాడు. ముంబైలో అతడి చిరునామా వద్ద సేకరించిన వివరాలు, ఫోన్నంబర్లు ఆధారంగా ఢిల్లీలో ఉండే అవకాశాలున్నాయిని భావిస్తున్నారు. కాగా, ఢిల్లీకి ఓ బృందం వెళ్లనుంది. ఇల్యుమినాటి పేరుతో ఒక రహస్య సంస్థ ఇంటర్నెట్లో కొనసాగుతోంది.