నిజామాబాద్ నుండి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచేదాకా.. నిఖత్ జరీన్ స్పూర్తిదాయక ప్రయాణం!!
నిజామాబాద్ నుండి ప్రపంచంలోని అగ్రస్థానానికి బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఎంతోమంది అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన ఐదో భారతీయ మహిళా బాక్సర్గా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గురువారం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఆమె ప్రయాణం చాలా మందికి ప్రేరణనిస్తుంది.

నిఖత్ జరీన్ బాక్సింగ్ లో ఛాంపియన్ గా నిలిచే దృఢ సంకల్పం వెనుక ఆమె ఉద్దేశం
నిజామాబాద్లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్ లో ఛాంపియన్ గా నిలిచే దృఢ సంకల్పం వెనుక పురుషులతో సమానంగా మహిళలు కూడా పోరాడాలన్నది తెలియజేయాలనే నిర్ణయం ఉంది. దానికోసం ఆమె ఎన్నో కష్టాలను అనుభవించింది. స్త్రీలు పురుషులతో సమానంగా కఠినంగా ఉంటారని నిరూపించాలనుకునే మొండి యువ క్రీడాకారిణిగా ఆమె తన ప్రయాణాన్ని సాగిందని నిఖత్ తండ్రి జమీల్ అహ్మద్ కుమార్తె పట్టుదల గురించి చెప్పారు. తల్లిదండ్రులుగా, మేము చాలా సంతోషంగా మరియు గర్వపడుతున్నాము. కష్ట సమయాల్లో ఆమెకు మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.

బాక్సింగ్ లో గాయాలు అవుతాయన్నా సరే మొండిగా బాక్సింగ్ ఎంచుకున్న నిఖత్ జరీన్
ఇక నిజామాబాద్లోని బాక్సింగ్ కోచ్ షంషుద్దీన్ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ పట్టుదల ఎంతో మందికి ప్రేరణ అంటూ పేర్కొన్నారు. 2008లో, నిఖత్ అబ్బాయిలతో ఆడుకోవడం చూసి నేను ఆమెను గ్రౌండ్కి తీసుకెళ్లానని , అక్కడ మైదానంలోని బాక్సింగ్ శిబిరాన్ని చూసిన ఆమె అందులో మహిళలు ఎవరు ఎందుకు లేరు అని ప్రశ్నించిందని పేర్కొన్నారు. అయితే బాక్సింగ్లో గాయాలు, చేతి పిడికిలి కి ఇబ్బందులు ఉంటాయని తాను చెప్పానని, అయినా సరే తాను బాక్సింగ్ చేస్తానంటూ మొండిగా బాక్సింగ్ రింగ్ లోకి దిగిందని పేర్కొన్నారు.

2009 నుండి బాక్సింగ్ లో రాణిస్తూ ముందుకు వెళ్తున్న నిఖత్ జరీన్
2009 సంవత్సరం, నిఖత్ నేషనల్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మూడు నెలల తర్వాత, ఆమె జూనియర్ నేషనల్స్లో స్వర్ణం మరియు బెస్ట్ బాక్సర్ అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె ద్రోణాచార్య అవార్డు గ్రహీత మరియు కోచ్ ఐ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని SAI క్యాంపుకు ఎంపికైంది. ఆమె 2011లో జూనియర్ మరియు యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించి, స్టార్ కెరీర్కు నాంది పలికింది.

2017లో భుజానికి ఆపరేషన్ .. అయినా పట్టు వదలకుండా బాక్సింగ్ శిక్షణ
ఈ కాలంలో కూడా నిఖత్ జరీన్ అనేక కష్టాలను ఎదుర్కొంది. ఆమె 2017లో ఆల్ ఇండియా యూనివర్శిటీ గేమ్స్లో భుజం ఎముక పక్కకు కలగడంతో శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది, అది ఆమెను ఒక సంవత్సరం పాటు రింగ్కు దూరంగా ఉంచింది. ఆ సమయంలో గాయం వల్ల మానసికంగా మరియు శారీరకంగా నిఖత్ కృంగిపోయింది. కానీ సంవత్సరం తర్వాత మరింత ఉత్సాహంతో శిక్షణను ప్రారంభించింది. బాక్సింగ్ ఛాంపియన్ కావడానికి ఆమె కఠినమైన శిక్షణ ను తీసుకోవాల్సి వచ్చింది.

ఆసక్తి, పట్టుదల, ఆత్మవిశ్వాసం నిఖత్ ను గెలిపించాయన్న కోచ్ లు
2018లో నేషనల్స్లో పోటీ పడ్డ జరీన్ ఆపై ఆసియా క్రీడలు మరియు కామన్వెల్త్ గేమ్లలో ఓటమిపాలైంది. కానీ అది తనను ప్రేరేపించిందని తన విజయం తర్వాత నిఖత్ వెల్లడించింది. ఆమె ఆసక్తి మరియు ఆత్మవిశ్వాసం, సాధించాలనే పట్టుదల ఆమె ఇప్పుడు ఉన్న స్థానానికి చేరుకోవడానికి సహాయపడింది. ప్రపంచ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగుర వేయాలి అనే ఆమె సంకల్పమే ఆమె ప్రత్యేకత' అని ఆమె కోచ్ లు గర్వంగా చెప్పారు.