నిఖిల్ తల్లిదండ్రులకు క్షోభ?: అసలేమైంది, గార్డియన్ ఎవరు?
హైదరాబాద్: నగరంలోని గ్లోబల్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం తీవ్ర విమర్శలకు దారితీసింది. లక్డికాపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో నిఖిల్ రెడ్డి అనే యువకుడికి ఎత్తు పెంచుతామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆపరేషన్ నిర్వహించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బెడ్పై తన కుమారుడి దయనీయ స్థితిని చూసి ఆ తండ్రి ఎంతో ఆవేదనకు గురయ్యాడు.
ఆసుపత్రిలో రెండు కాళ్లు కట్ చేసి ఉండటంతో అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడి చూసిన నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి ఆసుపత్రి వైద్యులపై ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడికి ఆపరేషన్ చేస్తే తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అంటూ నిలదీశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా ఆపరేషన్ చేస్తారని ప్రశ్నించారు.
అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు బెంగుళూరులో ఉన్నాడని తాము ఇప్పటి వరకు అనుకుంటున్నామని చెప్పారు. మూడు రోజులుగా తన కుమారుడి నుంచి ఎటువంటి ఫోన్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని తమ కుమారుడి ఫోన్ ఆధారంగా ట్రాక్ చేస్తే గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసిందని చెప్పుకొచ్చారు.
ఈరోజు ఉదయం ఆసుపత్రికి వచ్చి తమ కుమారుడికి ఏమైందని అడిగితే ఆసుపత్రి యాజమాన్యం స్పందించడం లేదని అన్నారు. చివరకు ఆసుపత్రిలోని వాచ్మెన్ జరిగిన విషయాన్ని చెప్పడంతో వైద్యులను నిలదీశామన్నారు. తమ కుమారుడు తెలిసో తెలియక ఎత్తు పెంచుకునేందుకు వస్తే డాక్టర్లు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి తమకు తెలియకుండా ఆపరేషన్ చేశారని అన్నారు.
దీంతో మీ కుమారుడి రెండు కాళ్లు కత్తిరించామని, కాళ్లలో రాడ్లు వేసి అతని ఎత్తు పెంచుతామని చెప్పారని అన్నారు. సుమారు 7 గంటల పాటు ఈ సర్జరీ చేశామని వైద్యులు తెలిపారని అన్నారు. ఈ ఆపరేషన్ కోసం రూ. 4 లక్షలు వసూలు చేశారని నిఖిల్ తండ్రి చెప్పారు. మమ్మల్ని ఎంతో క్షోభకు గురిచేసిన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏడు గంటలుగా ఐసీయూలో తమ కుమారుడికి ఏమి చేస్తున్నారో తమకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నిఖిల్ తండ్రి గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ కుమారుడు ఎత్తు తక్కువగా ఉన్నాడా? అంటే అలాంటిదేమీ లేదని 5.7 ఎత్తు ఉన్నాడని బాధితుడి తండ్రి పేర్కొన్నాడు.
ఎప్పుడూ తాను ఎత్తు తక్కువ ఉన్నాననే భావన కూడా తమ ముందు వెలిబుచ్చలేదని తెలిపాడు. అయితే ఇప్పుడు సడన్గా ఇలా ఆపరేషన్ చేయడం ద్వారా తమ కుమారుడు సంవత్సరం పాటు వీల్చైర్కే పరిమితవ్వడం బాధగా ఉందని తెలిపాడు. నిఖిల్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తమకు బెంగగా ఉందని, తమ కుమారుడిని తక్షణమే చూపించాలని బాధితుడి తల్లిదండ్రులు ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించారు.
అయితే నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేయడాన్ని ఆసుపత్రి సిబ్బంది మాత్రం సమర్ధించుకుంటున్నారు. నిఖిల్ మేజర్ కాబట్టి ఆపరేషన్ చేశామని వైద్యులు చెబుతున్నారు. మైనారిటీ తీరిన వ్యక్తి ఎవరు వచ్చినా, అతని వెనుక ఎవరు లేకున్నా అతను కోరితే ఆపరేషన్ చేస్తామని వారు సమాధానం చెప్పారు.
ఇదిలా ఉంటే నిఖిల్కు ఆపరేషన్ చేయమని గార్డియన్గా సమీప బంధువు సంతకం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మేజర్ అయినంత మాత్రాన పేరంట్స్కు సమాచారం అక్కర్లేదా? అంటూ మండిపడుతున్నారు. మరోవైపు నిఖిల్ రెడ్డి బంధువులు సైతం ఈ ఘటనపై మండిపడుతున్నారు.
అయితే ఆ గార్డియన్ ఎవరు అనే విషయం తెలియరాలేదు. అంతేకాదు గార్డియన్ సంతకం పెడితే తాము ఆపరేషన్ చేశామని చెబుతోన్న ఆసుపత్రి సిబ్బంది నైతికతను మరిచిపోయిందంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలా నిఖిల్ రెడ్డి ఆపరేషన్లో అంతు చిక్కని ప్రశ్నలెన్నో ఉన్నాయి. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాకంపై నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.