తప్పుడు నిర్ణయం, జాబ్ పోయింది: పొడవు కోసం కాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్రెడ్డి ఆవేదన
హైదరాబాద్: సినీ హీరో నితిన్ మాదిరిగా పొడవు కావాలని రెండు నెలల క్రితం కాళ్లకు ఆపరేషన్ చేయించుకున్న సాప్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి ఇప్పుడు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తనకు ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్లను తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మీడియా ముఖంగా తన ఆవేదనను వెళ్లగక్కారు.
నొప్పుల బాధ భరించలేక రోజుకు రెండు పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తోందని నిఖిల్ రెడ్డి తెలిపారు. తన కాళ్లకు ఆపరేషన్ చేసి రెండు నెలలు గడుస్తున్నా డాక్టర్లు చెప్పినట్లుగా కాలి ఎముక ఎత్తు పెరగలేదని వాపోయాడు. ఈ ఆపరేషన్ వల్ల తాను సర్వస్వం కోల్పోయానని, జాబ్ కూడా పోయిందని ఆవేదన చెందారు.
హీరో నితిన్లా కావాలనుకున్నా, పొడవు ఇలా వద్దు: టెక్కీ నిఖిల్
ఆపరేషన్ పూర్తై 60 రోజులు గడిచినా నడవడానికి తన కాళ్లు సహకరించడం లేదని ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఈ ఆపరేషన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు చెప్పారని అన్నారు. రెండు రోజుల్లో నడిపిస్తామని చెప్పి ఆపరేషన్ తర్వాత మాట మార్చారని వాపోయారు.
ఆపరేషన్కు సంబంధించి కూడా తనకు పూర్తి సమాచారాన్ని తెలియజేయలేదని వాపోయారు. ఎత్తు కోసం చేసిన ఆపరేషన్ ఆపరేషన్ విషయంలో వైద్యులు నిబంధనలు పాటించలేదని ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
తాను జీవితంలో అతి పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నాయనని ఎంతో ఆవేదన చెందారు. ఆపరేషన్కు సంబంధించి కూడా తనకు పూర్తి సమాచారాన్ని తెలియజేయలేదని వాపోయారు.
మరోవైపు నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్ధన్ రెడ్డి తన కుమారుడి పరిస్థితిపై ఆవేదన చెందుతున్నారు. గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్ చంద్రబోస్ రెండు నెలల్లో నయం చేస్తానని చెప్పి ఇప్పుడు మాట్ మార్చారన్నారు. వైద్య వృత్తిలో ఒక ప్రయోగంలా తమ కుమారుడికి సర్జరీ చేశారని ఆరోపించారు.
కాళ్లు నరికి ప్రయోగం చేశారు: టెక్కీ నిఖిల్ తండ్రి నిరసన
అంతేకాదు తమ కుమారుడికి చేసిన చికిత్స తీరు గురించి కూడా మీడియాకు చెప్పొద్దని గ్లోబల్ ఆసుపత్రి వర్గాలు తమను ప్రాధేయపడిందని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ ఆనంతరం ఇంటికి వచ్చిన డ్రెస్సింగ్ చేస్తామని చెప్పిన డాక్టర్ కూడా ఇంటికి రావడం మానేశారని అన్నారు.
తమ కుమారుడు నొప్పులు తట్టుకోలేక పోవడం వల్లనే ట్రీట్మెంట్ను ఆపేయాల్సిందిగా కోరామని తెలిపారు. తమ కుమారుడి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన ఆసుపత్రి యాజమాన్యాన్ని, డాక్టర్ను వదిలే ప్రసక్తే లేదని గోవర్ధన్ స్పష్టం చేశారు. పొడవు పెరిగేందుకు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా రెండు నెలల క్రితం నిఖిల్ రెడ్డి హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రిలో కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.