హీరో నితిన్లా కావాలనుకున్నా, పొడవు ఇలా వద్దు: టెక్కీ నిఖిల్
హైదరాబాద్: సినీ హీరో నితిన్ మాదిరిగా పొడవు కావాలని అనుకున్నానని, అందుకే పొడవు పెరగడానికి శస్త్రచికిత్సకు సిద్దపడ్డానని నిఖిల్ రెడ్డి చెప్పాడు. పొడవు పెరిగేందుకు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్ హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రిలో కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.
నిఖిల్ రెడ్డి శనివారంనాడు ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ చానెల్ ఎన్టీవితో మాట్లాడాడు. పొడవు పెరగడానికి ఎవరూ శస్త్రచికిత్స చేయించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఆపరేషన్ చేయించుకోవడం తప్పేనని అతను అంగీకరించాడు.
కాసుల కోసం నిఖిల్ కాళ్లు కోశారు: ఆపరేషన్ ఇలా, సంక్లిష్ట ప్రక్రియ (పిక్చర్స్)
సైడ్ ఎఫెక్ట్స్తో తాను నరకయాతన అనుభవిస్తున్నట్లు అతను తెలిపాడు. సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో పొడవు పెరగడానికి ఆపరేషన్కు సిద్దపడినట్లు తెలిపాడు. ర్యాగింగ్ కారణంగా పొడవు పెరగాలనే కసి తనలో పెరిగిందని చెప్పాడు. తనను వాళ్లు ఆట పట్టించారని చెప్పాడు. కృత్రిమంగా పొడవు కావాలని అనుకోవడం పెద్ద తప్పు అని చెప్పాడు.
తమ ఇంజనీరింగ్ క్లాస్లో మొత్తం 30 మంది విద్యార్థులం ఉండేవాళ్లమని, అందులో ముగ్గురమే 5.7 అడుగల కన్నా తక్కువ ఎత్తు ఉండేవాళ్లమని, అందుకే తాను మిగిలిన వాళ్లలా రెండు మూడు అంగుళాలు పెరిగేందుకు శస్త్రచికిత్స చేయించుకోవాలనే సాహసం చేశానని నిఖిల్ చెప్పాడు.
డాక్టర్లు రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని చెప్పారని, వారం రోజుల్లో వాకర్ సాయంతో నడవొచ్చని అన్నారని, కానీ పది రోజులవుతున్నా తాను కూర్చోలేకపోతున్నానని చెప్పాడు. అతను సాక్షి టీవీతో కూడా మాట్లాడాడు. తాను పనిచేసే కంప్యూటర్ సంస్థలో వచ్చే జీతం మొత్తాన్ని అమ్మకే ఇస్తుండేవాడినని చెప్పాడు.
సర్జరీకి అయ్యే డబ్బు కోసం రాత్రుళ్లు పనిచేసి వివిధ రకాల కంప్యూటర్ అప్లికేషన్స్ రూపొందించినట్లు తెలిపాడు. ఆ డబ్బుతోనే ఆస్పత్రి ఫీజు చెల్లించినట్లు తెలిపాడు. ఏప్రిల్ 5వ తేదీన ఆరు గంటల పాటు వైద్యులు తనకు శస్త్రచికిత్స చేశారని ఆయన చెప్పారు.
కాళ్లలో మంటలు, బొబ్బలు వస్తున్నాయని, తమ అన్నయ్య సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడని, తానూ సొంతంగా కంపెనీ పెట్టి హుందాగా ఎదగాలని అనుకుంటున్నానని నిఖిల్ చెప్పాడు. కాలేజీ రోజుల్లో తాను రూపొందించిన వివిధ అప్లికేషన్లకు మంచి డిమాండ్ వచ్చిందని చెప్పాడు.
నిఖిల్ వ్యవహారంపై త్వరలో భారత వైద్య మండలికి ఫిర్యాదు చేస్తామని, తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కూడా కలుస్తామని తండ్రి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. తన కుమారుడి విషయంలో వైద్యులు అనైతికంగా వ్యవహరించారని అన్నారు.
హైదరాబాద్ లక్డికాపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో నిఖిల్ రెడ్డి అనే యువకుడికి ఎత్తు పెంచుతామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆపరేషన్ నిర్వహించిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బెడ్పై తన కుమారుడి దయనీయ స్థితిని చూసి ఆ తండ్రి ఎంతో ఆవేదనకు గురయ్యాడు.
నిఖిల్ తల్లిదండ్రులకు క్షోభ?: అసలేమైంది, గార్డియన్ ఎవరు?
ఆసుపత్రిలో రెండు కాళ్లు కట్ చేసి ఉండటంతో అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడి చూసిన నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి ఆసుపత్రి వైద్యులపై ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడికి ఆపరేషన్ చేస్తే తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అంటూ నిలదీశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా ఆపరేషన్ చేస్తారని ప్రశ్నించారు.