యువతి శరీరంలో బుల్లెట్.. సర్జరీ చేసి అవాక్కైన నిమ్స్ డాక్టర్స్.. మిస్టరీ ఏంటో?
నిమ్స్ ఆసుపత్రిలో కలకలం రేగింది. ఓ యువతికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఆమె శరీరంలో బుల్లెట్ ఉన్నట్టు గుర్తించారు వైద్యులు . దాదాపు శరీరంలో బుల్లెట్ శరీరంలో ఉన్నా అదెలాగ వచ్చిందో తనకు తెలీదని చెప్పిన యువతి తీరు అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. సర్జరీ సమయంలో బుల్లెట్ బయటపడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సర్జరీ సమయంలో యువతి శరీరంలో బుల్లెట్... నిమ్స్ లో కలకలం
వివరాల్లోకి వెళ్తే ఫలక్ నుమా కు చెందిన ఒక యువతి వెన్నెముకలో వస్తున్న భరించలేని నొప్పితో ఆస్పత్రికి వెళ్ళగా బుల్లెట్ బయటపడిన ఘటన హైదరాబాద్ లో సంచలనం గా మారింది. . బహదూర్పుర మండలం, జహానుమా ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాదర్ కుమార్తె 18 ఏళ్ళ అస్మా బేగం వెన్నునొప్పితో రెండు నెలల క్రితం నిమ్స్ ఓపీ విభాగానికి వెళ్ళింది . సాధారణ వెన్నునొప్పిగా భావించిన వైద్యులు ఆమెకు మందులు రాసి పంపించారు.
శరీరంలో బుల్లెట్ ఎలా వచ్చిందో తనకు తెలీదన్న యువతి
నెల రోజుల తర్వాత కూడా ఆమె నొప్పి తీవ్రంగా ఉందని ఆస్పత్రికి వెళ్ళగా ఆమె శరీరంలో ఫారిన్ బాడీ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో ఓ బుల్లెట్ ఆమె శరీరం నుండి బయట పడింది . ఈ ఘటనతో అవాక్కయిన వైద్యులు బుల్లెట్ శరీరంలోకి ఎలా వచ్చిందని ఆ యువతిని ప్రశ్నించారు. కానీ ఆ యువతీ తనకు తెలీదని సమాధానం చెప్పింది. దాదాపు ఏడాదిన్నరగా ఆమె శరీరంలో బుల్లెట్ ఉండి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. బుల్లెట్ వల్లే యువతీ తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు చెప్తున్నారు.
పోలీసుల దర్యాప్తు.. పొంతన లేని విషయాలు చెప్తున్న కుటుంబ సభ్యులు
ఆపరేషన్ చేసిన యువతి అస్మా బేగంను వైద్యులు ఇంటికి పంపించారు.అయితే బుల్లెట్ ఎలా వచ్చింది అన్న దానిపై పోలీసులకు కుటుంబ సభ్యులు పొంతన లేని విషయాలను చెప్తున్నారు. అయితే, అస్మా బేగం కుటుంబసభ్యులు మాత్రం రెండేళ్ల క్రితం ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది . ఒకవేళ అదే నిజం అయితే రెండేళ్ల క్రితం కాల్పులు జరిపి ఉంటే పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చెయ్యలేదు. తూటా శరీరంలోకి దిగితే అయినగాయానికి వైద్యం ఎక్కడ చేయించారు? అనే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పటం లేదు.
మెడికో లీగల్ కేసుగా కేసు నమోదు .. తండ్రి కానిస్టేబుల్ కావటంతో పలు అనుమానాలు
మెడికో లీగల్ కేసుగా భావించి ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, వారు గతంలో ఏ ప్రాంతంలో ఉండేవారు? అక్కడ ఏదైనా ఫైరింగ్ పాయింట్స్ ఉన్నాయా? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.ఇక అంతే కాదు ఆమె తండ్రి కానిస్టేబుల్ అని కుటుంబ కలహాల నేపధ్యంలో ఏమైనా ఘటన జరిగిందా అన్న కోణం కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. పలు అనుమానాలకు తావిస్తున్నాయి.