నా ఫ్యామిలీకి సంబంధంలేదు: నీరవ్, హైదరాబాద్ ఆస్తులపైనా తిరకాసు! అసలు ఉద్దేశ్యం ఇదీ!!
హైదరాబాద్/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పెద్ద మొత్తంలో టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆ బ్యాంకుకు లేఖ రాశారు. బ్యాంకు తన బ్రాండ్ విలువను నాశనం చేసిందని, దీని వల్ల బ్యాంకుకు అప్పులను కట్టే అవకాశాన్ని తగ్గించారని ఆరోపించారు.
పిఎన్బి స్కాం:'మోడీని కలవలేదు, నీరవ్ మామతో మీ ఫోటోలు', బ్యాంక్ ఉద్యోగికి విలాసవంత విల్లా
తాను చెల్లించాల్సిన డబ్బు బ్యాంకు చెబుతున్న దాని కంటే తక్కువగా ఉందని వెల్లడించారు. తన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాఫ్తు సంస్థలు కేసులు నమోదు చేశాయని, వారికి దీంతో సంబంధం లేదన్నారు. నీరవ్ ఈ లేఖను 15వ తేదీ అర్ధరాత్రి తర్వాత రాశారని తెలుస్తోంది.
మా కుటుంబానికి సంబంధం లేదు
తన నుంచి చెల్లించాల్సిన డబ్బును త్వరగా రాబట్టుకోవాలని ఆత్రుతతో బ్యాంకు అధికారులు తన ఆఫర్ని అంగీకరించడానికి బదులుగా విషయాన్ని బహిర్గతం చేశారని, దీని వల్ల తన బ్రాండ్ విలువ పడిపోయిందని, వ్యాపారాలు దెబ్బతిన్నాయని, డబ్బు తిరిగి చెల్లించే అవకాశాన్ని మీరే తగ్గించారన్నారు. తన భార్యకు తన వ్యాపారంతో సంబంధం లేదని చెప్పారు. తన మామ ఛోక్సీది వేరే వ్యాపారమని, తన బ్యాంకు లావాదేవీలతో ఆయన కంపెనీకి సంబంధం లేదన్నారు.
అయిదు పేర్లతో పది యూనిట్లు
రావిర్యాల జెమ్స్ పార్కులో 2007 నుంచి గీతాంజలి జెమ్స్ అండ్ జ్యువెవల్లర్స్, బిలియన్ జ్యువెల్లర్స్, బెలిజ్ జ్యువెల్లర్స్, నక్షత్ర్ జ్యువెల్లర్స్ పేర్లతో నీరవ్ మొత్తం పది యూనిట్లు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి వజ్రాలను సానబట్టి, వాటితో ఆభరణాలు చేయించి నగరంలో ఏర్పాటు చేసిన షోరూంల ద్వారా అమ్మించేవాడు.
హైదరాబాదులోని షోరూంలో సోదాలు, స్వాధీనం
హైదరాబాద్ ఈడీ అధికారులు జెమ్స్ పార్కులోని నీరవ్ మోడీ సంస్థలపై దాడులు చేసి అక్కడున్న సరుకు, వాటి లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులోని షోరూంలలోను సోదాలు నిర్వహించి అక్కడి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులు దర్యాఫ్తులో భాగంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ ఆస్తులను అంచనా వేస్తున్నారు
హైదరాబాదులో నీరవ్ మోడీ సంస్థల్లోని సరుకును స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు వాటిని అంచనా వేస్తున్నారు. నిపుణులతో అంచనా వేయిస్తున్నారు. దిగుమతి చేసుకున్న ఈ సరుకుకు సంబంధించి ఇన్ వాయిస్లోని విలువ, వాస్తవంగా దాని విలువ ఎంత ఉంటుందన్న దానిని బట్టి బేరీజు వేస్తారు.ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఎంత అన్నది న్యాయస్థానానికి సమర్పిస్తారు.
నీరవ్ అసలు ఉద్దేశ్యం ఇదేనా
ఒక్కో వజ్రాన్ని ఒక్కో యూనిట్గా లెక్క కట్టి లెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా, రికార్డుల్లో చూపిస్తున్న దానికి, వాస్తవంగా ఉన్న సరుకు విలువకు పొంతన కుదరడం లేదని వార్తలు వస్తున్నాయి. పది యూనిట్లలో రూ.3100 కోట్ల విలువైన సరుకు ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా, వాస్తవంగా రూ.500 కోట్లకు మించడం లేదని తెలుస్తోంది. జెమ్స్ పార్కులోని తమ పేరిట ఉన్న స్థలాన్ని తాకట్టు పెట్టి జీవిత బీమా సంస్థ ద్వారా రుణం తీసుకున్న నీరవ్ మోడీ దిగుమతి చేసుకున్న సరుకును వందల రేట్లలో పెంచి చూపించినట్లుగా తెలుసుకున్నారు. అదే కాగితాలను మళ్లీ గ్యారెంటీగా చూపించి మళ్లీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడని గుర్తించారు. నీరవ్ అసలు ఉద్దేశ్యం వ్యాపారం చేయడం కంటే వ్యాపారం జరుగుతున్నట్లుగా చూపించి తప్పుడు పత్రాలతో రుణం తీసుకోవడమే కావొచ్చునని భావిస్తున్నారు.