11మంది అమ్మాయిల ఫిర్యాదు: డీ శ్రీనివాస్ తనయుడిపై నిర్భయ కేసు, ఏ క్షణమైనా అరెస్ట్
నిజామాబాద్: రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పైన నిజామాబాద్ జిల్లా పోలీసులు శుక్రవారం నిర్భయ కేసు నమోదు చేశారు. ఉదయం విద్యార్థినులు సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై ఐపీసీ 354, 354ఏ, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
అతను పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అంతకుముందు పోలీసులు అతనిని అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో అందుబాటులో లేరు. దీంతో అతని కోసం గాలిస్తున్నారు. అతనిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశముంది.
ఎంపీ డీఎస్ కొడుకు సంజయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, 11 మంది అమ్మాయిలు ఫిర్యాదు
సంజయ్ ఖండన
తనపై వస్తున్న ఆరోపణలను సంజయ్ ఖండించారు. తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇవన్నీ చేస్తున్నారన్నారు. నర్సింగ్ కాలేజీ విద్యార్థినులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఎవరితోను సహజీవనం చేయడం లేదని, శాంకరి కాలేజీని ఎప్పుడో ఇతరులకు అప్పగించానని చెప్పారు.
కాగా, సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని నిజామాబాద్లో శాంకరి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, పీడీఎస్యూ, ఇతర సంఘాల ప్రతినిధులు, తమ తల్లిదండ్రులతో 11 మంది విద్యార్థినులు సచివాలయంలో ఆయనను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం నిజామాబాద్ సీపీకి విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.
విద్యార్థినులు శుక్రవారం నిజామాబాద్ సీపీ కార్తికేయను కలిసి తమ ఆవేదన చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరారు. తమ చదువు వృధా కాకుండా వేరే కాలేజీలో చేర్పించాలన్నారు. సంజయ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాల మూసివేయాలని కోరారు. కాలేజీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, బూతులు తిడుతూ సంజయ్ లైంగికంగా వేధించారని ఆరోపించారు. తన గదిలోకి రావాలని బలవంత పెడుతున్నారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు.