నిర్మల సీతారామన్ అనుకోకుండా మంత్రి అయ్యారు..!రాహుల్ ని విమర్శించే స్థాయి ఆమెకు లేదన్న పొన్నం..!
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై తెలంగాణా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పేద ప్రజల కోసం, వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రతి రోజు పరితపిస్తూ తన వంతు మనో ధైర్యాన్ని కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్న వాయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ విమర్శించడం ఆశ్చర్యంగా ఉందని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం నిర్మల సీతారామన్ పై ఘాటు విమర్శలు చేసారు పొన్నం. నిర్మల సీతారామన్ ప్రదవశాత్తూ, ఆక్సిడెంటల్ గా ఆర్థిక శాఖ మంత్రి అయ్యారని, రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి ఆమెకు లేదని మండిపడ్డారు.
కేంద్ర ఆర్ధిక మంత్రిపై మండిపడ్డ పొన్నం.. రాహుల్ ను విమర్శించే అర్హత లేదన్న వర్కింగ్ ప్రసిడెంట్..
అంతే కాకుండా మంత్రి నిర్మల సీతారామన్, రోడ్ల పైన అనేక అష్ట కష్టాలు పడుతున్న వలస కార్మికులను చూస్తే వాళ్ళ బాధలు అర్థం అవుతాయని ఏసీ గదులలో కూర్చొని మాట్లాడితే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కరోనో సమయంలో రాజకీయాలు చేస్తుందని ఆర్థిక మంత్రి మాట్లాడడం దొంగే దొంగ దొంగ అని అరిచునట్టుందని, ఈ క్లిష్ట సమయంలో కూడా బీజేపీ రాజకీయలు చేస్తూ దీపాలు పెట్టాలని, చప్పట్లు కొట్టాలని పిలుపునిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. 20 లక్షల కోట్ల ప్యాకేజి అంటూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ ప్యాకేజీలతో పేద ప్రజలకు ఒరిగిందేమి లేదని, కరోనా మాటున దేశంలో ఉన్న కీలక రంగాలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఘాటుగా విమర్శించారు.
ప్రాజెక్టుల్లో అంతా మోసమే.. బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వానికి పొన్నాల లక్ష్మయ్య సవాల్..
ఇదిలా ఉండగా రాష్ట్రంలో వివాదాలు తలెత్తే సమయంలో తనేదో చేస్తున్నట్టు సుదీర్ఘ క్యాబినెట్ భేటీలు, సమీక్షలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గత ఆరు సంవత్సరాల పాలన కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పైన చర్చలేదని, ఇంతవరకు ఎక్కడైనా మరో కొత్త ప్రాజెక్టును ప్రారంభించారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గోదావరిలో మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులు మొదలు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పొన్నాల గుర్తు చేసారు. అంతే కాకుండా హైద్రాబాద్ ప్రాంత ప్రజాల దాహార్తిని తీర్చడానికి ఎల్లంపల్లి నుంచి చేపట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని తెలిపారు.
చేసిందంతా కాంగ్రెస్ పార్టీనే.. తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్న పొన్నాల ..
ఇక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తే, సీఎం చంద్రశేఖర్ రావు దాన్ని నిర్లక్ష్యం చేసారని, ఎల్లం పల్లి నుండి మిడ్ మానేరు వరకు చేపట్టిన ప్రాజెక్టు 2 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని పొన్నాల తెలిపారు. గత ఏడాది SRSP,ఎల్లంపల్లి వద్ద కు 108 టీఎంసీల నీళ్లు వస్తే, కేవలం 22 టీఎంసీల నీళ్లు మాత్రమే వాడుకుని, మిగిలిన 86 టీఎంసీల నీళ్లు వృధాగా వెళ్లి పోయాయని అన్నారు. కనీసం నికర జలాలు వాడుకోలేని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపి తెలంగాణాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఏం చేశారని ప్రశ్నించారు. దోపిడి కోణంలో తెచ్చిన 3 టీఎంసీల టెండర్లన్నీ వెంటనే రద్దు చేయాలని, ప్రస్తుతం 3 టీఎంసీల ప్రాజెక్టు అప్రస్తుతమని, ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం చంద్రశేఖర్ మోసం చేస్తున్నారని పొన్నాల మండిపడ్డారు.
Recommended Video
నీళ్ల పేరుతో కేసీఆర్ మోసం.. వాస్తవాలు ప్రజలు గ్రహిస్తున్నారన్న పొన్నాల..
అంతే కాకుండా శ్రీ రాం సాగర్ నుండి లోయర్ మిడ్ మానేరుకు నీళ్లు పంపిస్తున్నామని సీఎం చంద్రశేఖర్ రావు చెబుతున్న అంశం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేనని పొన్నాల చెప్పారు. ప్రాజెక్టుల పైన వాస్తవాలు బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం చర్చకు రావాలని పొన్నాల సవాల్ విసిరారు. ప్రజలను నమ్మించడానికి అబద్దాలు చెబుతున్నారని, ఇది నీళ్ల పేరుతో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మరో దోపిడీ కోణమని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో ఏ కొత్త పనులు చేపట్టలేదని స్పష్టం చేసారు. ఇది ప్రజల డబ్బులను నిరర్ధకం చేసేలా ప్రాజెక్టుల పేరుతో మోసం చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు.