డిజిటల్ పేమెంట్స్-కేంద్రం బంపరాఫర్: స్వైప్ చేస్తే రూ.1 కోటి బహుమతి!
డిజిటల్ పేమెంట్స్-కేంద్రం బంపరాఫర్: స్వైప్ చేస్తే రూ.1 బహుమతి!
న్యూఢిల్లీ/హైదరాబాద్: నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నీతి అయోగ్ భావిస్తోంది. ఇందులో రూ.1 కోటి ప్రైజ్ మనీ కూడా ఉండటం గమనార్హం.
కనీసం రూ.10 లక్షల నుంచి అత్యధికంగా రూ.1 కోటి వరకు గెలుచుకునే ప్రోత్సాహకాలను పరిశీలిస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించేందుకు ప్రోత్సాహక పథకాన్ని నీతి ఆయోగ్ రచించింది.
డిజిటల్ పేమెంట్స్
డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్స్ను ఉపయోగించిన వారికి భారీ నగదు బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ని కోరింది.
రూ.125 కోట్ల కేటాయింపు
దీనికోసం జాతీయ ఆర్థిక సమ్మిళిత నిధి నుంచి నుంచి రూ.125 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఎన్పీసీఐ పరిధిలో రిటెయిల్ పేమెంట్స్ సిస్టమ్స్ ఉన్నాయి.
ప్రమోటర్లు
ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ ప్రమోటర్ బ్యాంకులుగా పని చేస్తున్నాయి.
వారు టార్గెట్.. రూ.కోటి బహుమతి
ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో నివసించేవారిని డిజిటల్ లావాదేవీలవైపు మళ్ళించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకం రూపొందుతోంది. డిజిటల్ లావాదేవీల ఐడీలను మూడు నెలలకు ఒకసారి డ్రా తీసి, ఒక విజేతకు గ్రాండ్ ప్రైజ్ రూ.1 కోటి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు.
డ్రా తీసి
వారానికి ఒకసారి డ్రా తీసి 10 మంది కస్టమర్లను, 10 మంది వ్యాపారులను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. పేదలు, దిగువ మధ్య తరగతి, చిన్న వ్యాపారులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
వీరు పథకంలోకి..
యూఎస్ఎస్డీ, ఏఈపీఎస్, యూపీఐ, రూపే కార్డులు ఉపయోగించే కస్టమర్లు, వ్యాపారాలు నిర్వహించే లావాదేవీలను ఈ పథకం కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పథకాన్ని ఈ నెలాఖరు నాటికి ప్రారంభించవచ్చునని తెలుస్తోంది.