సీబీఎస్ బస్టాండ్ హంగర్ కూలిపోవడంపై కేసీఆర్కు నిజాం మనవడి లేఖ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నిజాం మనవడు అలీఖాన్ ఆదివారం లేఖ రాశారు. గౌలిగూడ బస్ స్టేషన్ కూలడంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
తప్పిన పెను ప్రమాదం: కుప్పకూలిన సీబీఎస్ బస్టాండ్, 80ఏళ్లకుపైగా సేవలందించి..
బస్ స్టేషన్ కూలిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అలీఖాన్ అన్నారు. నిజాం ఆస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి, ఛాతి ఆసుపత్రిలను కూల్చి వేయాలని ప్రభుత్వం భావిస్తోందని లేఖలో ఆరోపించారు. చారిత్రక కట్టడాలని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
చారిత్రాత్మక గౌలిగూడ బస్టాండ్ (మిస్సిసిప్పీ హంగర్) గురువారం నిలువునా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ సమయంలో బస్టాండ్లో బస్సులు, ప్రయాణీకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో ఇంజినీర్ల సూచన మేరకు జూన్ 30 నుంచి బస్ స్టేషన్ మూసివేశారు.
నాటి నుంచి బస్సులను, ప్రయాణికులను బస్ స్టేషన్లోకి అనుమతించడం లేదు. బస్సులు, ప్రయాణికులు లేని సమయంలో బస్ స్టేషన్ కుప్పకూలడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 88 ఏళ్ల క్రితం ఈ బస్టాండ్ను ఏర్పాటు చేశారు. మూసీ నదీ తీరాన అర్ధచంద్రాకారంలో విశాలంగా నిర్మించి ఈ షెడ్డును నిజాం బస్టాండ్గా మార్చారు.
1932 జూన్లో గౌలిగూడ బస్టాండ్ ప్రారంభమైంది. 30 ప్లాట్ ఫారాలతో 27 బస్సులతో గౌలిగూడ హ్యాంగర్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల రాకపోకలు కొనసాగాయి. 166 మంది నిజాం రోడ్ ట్రాన్స్పోర్టు ఉద్యోగులతో సేవలు ప్రారంభమయ్యాయి. 1994 తర్వాత కేవలం లోకల్ బస్సులు ఇక్కడి నుంచి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. కాగా, ఇది కూలిపోవడంతో ఇక్కడ అత్యాధునిక బస్టాండ్ నిర్మించాలని భావిస్తున్నారు. అందరు నిత్యం సంచరించే ప్రాంతంలో కూలిపోయిన హంగర్ పైన అనుమానాలు వ్యక్తం చేయడం అర్థంలేదని అంటున్నారు.