మాజీ ఎంపీ కవిత దిగ్భ్రాంతి.. ఆ ఘటన కలచివేసిందంటూ..
కరోనా లాక్ డౌన్ వేళ వైద్యులు,పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులు వైరస్పై వారియర్స్గా యుద్దం చేస్తున్నారు. వీరితో పాటు ఎంతోమంది జర్నలిస్టులు వార్తల సేకరణలో,రిపోర్టింగ్లో గ్రౌండ్లో ఉండి పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు జర్నలిస్టులను కూడా వైరస్ వెంటాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో ఏకంగా 53 మంది జర్నలిస్టులకు వైరస్ పాజిటివ్గా తేలడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరిలో చాలామంది ఓ ప్రముఖ టీవీ చానెల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. ఈ ఘటనపై తెలంగాణ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ స్పందించారు.
దిగ్భ్రాంతికి గురిచేసింది..
ముంబైలో జర్నలిస్టులకు కరోనా పాజిటివ్గా తేలిందన్న వార్త తనను కలచివేసిందని.. ఇది దురదృష్టకర సంఘటన అని కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు. కరోనాపై యుద్దంలో మన రాష్ట్రంలోనూ ముందుండి పోరాడుతున్న మీడియా మిత్రులు జాగ్రత్తగా ఉండాలని,వారి కుటుంబం పట్ల జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. కవితపై ట్వీట్పై నెటిజెన్స్ కూడా సానుకూలంగా స్పందించారు. మీడియా మిత్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ముంబైలో ఏం జరిగింది..
మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4666కి చేరగా.. ఇందులో ఒక్క ముంబై నగరంలోనే 2455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బృహన్ ముంబై కార్పోరేషన్ ఆధ్వర్యంలో మొత్తం 193 జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్లకు టెస్టులు చేయగా వారిలో 53 మందికి పాజిటివ్గా తేలింది. వీరందరిలోనూ ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అగర్వాల్ ఇది దురదృష్టకర సంఘటన అని విచారం వ్యక్తం చేశారు. ప్రతీ జర్నలిస్టు తమ విధుల్లో తమను తాము రక్షించుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అక్కడి జర్నలిస్టులు ఏమంటున్నారు..
ముంబై ప్రెస్ క్లబ్ కమిటీ చీఫ్ గుబీర్ సింగ్ దీనిపై మాట్లాడుతూ.. జర్నలిస్టులను ఫీల్డ్ రిపోర్టింగ్కి దూరంగా ఉంచాలని తాము మీడియా సంస్థలపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిపారు. వీలైనంతవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఒకవేళ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ కేసులు ఇలాగే కొనసాగితే.. గ్రేటర్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా డిమాండ్ చేస్తామన్నారు. రక్షణ కిట్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తామన్నారు. మీడియా సంస్థలు,ప్రభుత్వాలు సురక్షితమైన ప్రదేశాల నుండి ఎక్కువ మంది జర్నలిస్టులు పనిచేసే విధంగా ఒక ప్రణాళికను రూపొందించాలని కోరారు.
Recommended Video
చెన్నై,భోపాల్లోనూ..
తమిళనాడులోని చెన్నైలోనూ ఇటీవల ఓ పత్రిక రిపోర్టర్(25),ఓ తమిళ న్యూస్ ఛానెల్లో ఎడిటోరియల్ టీమ్ సభ్యుడు(23)కి కరోనా పాజిటివ్గా తేలింది. వీరిద్దరిలోనూ కొద్ది లక్షణాలు మాత్రమే కనిపించాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్లోనూ స్థానిక మీడియా సంస్థకు చెందిన ఓ కరస్పాండెంట్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దేశవ్యాప్తంగా ఇలా జర్నలిస్టులు సైతం కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.