ఓట్లేశాం.. మరి పసుపు బోర్డేది నాయనా.. ఎంపీ అర్వింద్ తీరుపై ఆగ్రహం..!
నిజామాబాద్ : ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. ఒడ్డు దాటాకా బోడ మల్లన్న తీరుగా ఉంటోంది నేతల వ్యవహార శైలి. గెలిచేంతవరకు ఒక రీతిగా మాట్లాడి.. తీరా గెలిచాక మాట మారుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్పై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ఐదు రోజులన్నారు.. గెలిచి యాభై రోజులవుతోంది, పసుపు బోర్డేది అంటూ రైతులు నిలదీస్తున్నారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఎంత ఈజీయో.. నెరవేర్చడం మాత్రం కష్టంతో కూడుకున్న పనే. తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నారు.
టీఆర్ఎస్ VS బీజేపీ.. కారు జోరుకు పువ్వు బ్రేక్ వేసేనా?
రానున్నది బీజేపీ ప్రభుత్వమంటూ పసుపు బోర్డుపై అర్వింద్ హామీ..!
లోక్సభ ఎన్నికల వేళ నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. అప్పటి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను వ్యతిరేకిస్తూ పసుపు, జొన్న రైతులు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారు. ఆమె ప్రాతినిధ్యం వహించిన ఐదేళ్లల్లో పసుపు బోర్డు ఏర్పాటు, జొన్న రైతులకు మద్దతు ధర లాంటి హామీలు విస్మరించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ధర్మపురి అర్వింద్.. తనను గెలిపిస్తే పసుపు బోర్డు తథ్యమంటూ హామీ ఇచ్చారు. కేంద్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని.. ఆ మేరకు కచ్చితంగా బోర్డు తీసుకొచ్చే బాధ్యత తనదేనని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు.
బాండ్ పేపర్ కూడా రాసిచ్చి..! యాభై రోజులవుతున్నా నో యూజ్
కవితకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలపడం.. పెద్దఎత్తున నామినేషన్లు వేయడం.. తదితర కారణాలతో మొత్తానికి నిజామాబాద్ ఎంపీ స్థానం అర్వింద్ పరమైంది. కవితపై ఆయన గెలుపు సునాయాసమైంది. సీఎం కేసీఆర్ కూతురుగా కవిత ఓడిపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఎన్నికల హామీల్లో భాగంగా అర్వింద్ పసుపు బోర్డు తెస్తానంటూ భరోసా ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి బాండ్ పేపర్ రాసి రిలీజ్ చేశారు. అయిదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకురాని పక్షంలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ అందులో పేర్కొన్నారు.
అర్వింద్ మాట తప్పుతున్నారా..! రైతుల ఆగ్రహం
లోక్సభ ఫలితాలు వచ్చి యాభై రోజులవుతోంది. కానీ అర్వింద్ ఇచ్చిన పసుపు బోర్డు హామీ మాత్రం నెరవేరలేదు. దాంతో ఆయన మాటకు కట్టుబడి నిలబడటం లేదనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. అంతేకాదు అతడు స్వయంగా రాసిచ్చిన అగ్రిమెంట్ ఒప్పందాన్ని సైతం గాలికొదిలేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపీగా గెలిచి యాభై రోజులవుతున్నా.. ఇంతవరకు పసుపు బోర్డు ఊసే లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో కూడా పసుపు బోర్డు ప్రస్తావన లేకపోవడంతో వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
అర్వింద్ స్పందించకుంటే ధర్నాకు సైతం..!
దేశమంతటా అత్యధికంగా పసుపు పండించేంది నిజామాబాద్ జిల్లా రైతులే. ఆ క్రమంలో పసుపు బోర్డు నిజామాబాద్కు వస్తే మద్దతు ధర లభిస్తుందనేది వారి ఆశ. దాంతో ఏళ్లకొద్దీ నిరీక్షించడమే తప్పా.. ఏ లీడర్ పసుపు బోర్డు తెచ్చింది లేదు. అందుకే ఎన్నికల వేళ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవితను వ్యతిరేకిస్తూ పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారు రైతులు. అదలావుంటే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ హామీ మేరకు ఆయనకు గంపగుత్తగా ఓట్లు పడ్డాయనేది ఓ వాదన. అయితే పార్లమెంట్ సమావేశాల్లో కనీసం ఆయన పసుపు బోర్డు గురించి ప్రస్తావించలేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంలో అర్వింద్ స్పందించకుంటే ఆయన ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు సైతం సిద్ధమని రైతులు రెడీ అవుతున్నట్లు సమాచారం.
దేవుడికే వాస్తు నేర్పుతున్న ప్రభుత్వం.. సెక్రటేరియట్ ఈశాన్యంలో అమ్మోరి ఆలయం..!
ఢిల్లీలో అర్వింద్.. వ్యవసాయశాఖ అధికారులతో భేటీ
అదలావుంటే బుధవారం (10.07.2019) నాడు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్తో భేటీ అయ్యారు అర్వింద్. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇకనైనా పరిష్కరించేలా విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం వ్యవసాయ శాఖలోని పలు విభాగాల ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమయ్యారు. పసుపు పంట నాణ్యత పెంపు, సాగు, వ్యవసాయం, మార్కెటింగ్ అంశాలపై మరింత సమగ్రంగా చర్చించేందుకు రెండు వారాల్లో మళ్లీ సమావేశం కావాల్సి ఉందన్నారు.
మరోసారి జరిగే సమావేశానికి రైతులను కూడా తీసుకురావాలని తనకు విభాగాధిపతులు సూచించినట్లు తెలిపారు. అయితే దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోయి (ఇండియా Vs ఇంగ్లాండ్ మ్యాచ్) క్రికెట్ చూస్తుంటే.. ఈ మాజీ క్రికెటర్ మాత్రం పసుపు రైతుల సంక్షేమం కోసం ఢిల్లీలో తిరుగుతున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.